TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాష్ట్రంలో ప్రభుత్వం వుందా?

Published on: Mon May 22, 2023 4:01PM

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో  కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారా, కారా? ఆ కేసులో సహా నిదితునిగా ఉన్న ఆయనకు ఈ నేరంతో   సంబంధం వుందా, లేదా? అసలు, కేసేమిటి. ఎక్కడ మొదలైంది ఎన్ని మలుపులు తిరిగింది? ఇప్పడు ఇవేవీ ప్రధాన ప్రశ్నలు కాదు. అసలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా, లేదా? అన్నదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. అవును  కర్నూల్  ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి  శ్రీ లక్ష్మి చికిత్స పొదుతున్న విశ్వభారతి ఆస్పత్రి వద్ద ఈ ఉదయం నుంచి సాగుతున్న తమషా చూస్తే ఎవరికైనా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది వుందా? పోలీసు వ్యవస్థ పనిచేస్తోందా అనే సందేహం కలగక మానదు.

 అవును హత్య కేసు విచారణ పూర్వాపరాలు ఇతర విషయాలను పక్కన పెట్టినా  ఇదేమిటి, కేంద్ర దర్యాప్తు సంస్థకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం సహకరించక పోవడం ఏమిటి? అధికార పార్టీ నాయకులు , కార్యకర్తలు, చివరకు ఏమ్మేల్యేలు, మాజీలు అస్పుపత్రిని తమ నిర్భండంలోకి తీసుకుని, సామాన్య ప్రజలు, రోగుల రాకపోకలకు అంతరాయం కల్పించినా,  శాంతి భద్రతల సమస్య సృష్టించిన స్థానిక పోలీసు యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషించడం దేనికి సంకేతం? ఈ పరిస్థతిని చూస్తే  రాష్ట్రంలో ప్రభుత్వం వుందా .. లేదా అనే సందేహం రాక మానదు.  

నిజానికి, వివేకా హత్య కేసులో విచారణ జరుపుతున్న సీబీఐ అనేక నిందలు మోస్తూ కూడా ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డికి  ఇవ్వవలసిన  గౌరవం.. కాదు కాదు అంతకంటే ఎక్కువే ఇచ్చింది. ఒకసారి కాదు, అనేక మార్లు సీబీఐ విచారణకు హాజరు కాకున్నా, చూసీ చూడనట్లు వదిలేసింది. అనేక వెసులుబాట్లు కల్పించింది. ఉదారంగా వ్యవహరించింది.  చాలా చాలా లాంగ్ లాంగ్ రోప్ ఇచ్చింది. అయినా, ఆయన సహకరించక పోవడంతో అరెస్ట్ అనివార్యమని భావించిందో ఏమో కానీ, కేంద్ర దర్యాప్తు సంస్థ ఒకడుగు ముందుకు వేసింది. ఈ రోజు విచారణకు హాజరు కావసిన గౌరవ ఎంపీ ఆఖరిక్షణంలో వారి తల్లి శ్రీ లక్ష్మి అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేక పోతున్నానని  లేఖ రాశారు. అయితే ఆయన ఆఖరి క్షణంలో విచారణకు హాజరు కాకపోవడం ఇదే మొదటిసారి కాదు, ఇప్పటికే రెండు మూడు సార్లు ఆయన ఇలాగే.. ఏవో కారణాలు చెప్పి విచారణకు హాజరు కాలేదు.

మరో వంక  సీబీఐ విచారణ నుంచి వెసులుబాటు పొందిన అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పించుకునేందుకు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అయినా ఎక్కడి కక్కడ ఆయనకు  చుక్కెదురవుతోంది. మరో వంక రాష్ట్ర పోలీసులు సహకరించని నేపధ్యంలో కేంద్ర బలగాల రక్షణలో ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది.. అదే జరిగితే రాష్ట్ర పోలీసు ప్రతిష్టే కాదు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట కూడా మరింతగా దిగాజరుతుందని అంటున్నారు. అంతే కాదు  ఇటీవల హైదరాబాద్ లో మధ్య ప్రదేశ్ పోలీసులు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన సంఘటనను గుర్తు చేస్తూ, ఒక  ఎంపీని అదే తరహాలో కేంద్ర పోలీసులు అరెస్ట్ చేయడం జరిగితే అది రాష్ట్రానికి తలవంపులుగా నిలిచి పోతుందని అంటున్నారు.