TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రోజా ఫైర్ కు కారణం అదేనా?

Published on: Tue Sep 20, 2022 7:04AM

ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గంలో అస్సలు పరిచమే అవసరం లేని మంత్రి ఎవరైనా ఉన్నారంటే, ఆ మంత్రి ..పేరు ..ఆర్కే రోజా... నిజమే మళ్ళీ ఆర్కే.. అంటే కొందరికైనా,  ఎవరామె?  అనే అనుమానం వస్తే రావచ్చును. కానీ, జబర్దస్త్ రోజా అన్నారనుకోండి, పిల్లా పాపా, గొడ్డు గోదా సహా ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాదు. ఠక్కున అర్థమైపోతుంది. ఆమె వందకు పైగా సినిమాల్లో నటించారు, రాజకీయాల్లోనూ చాలా కాలంగానే ఉన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు,. ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు.అయినా, రోజా అంటే జబర్దస్త్, జబర్దస్త్ అంటే రోజా .. అనేలా పాపులర్ అయ్యారు. అందుకే, రోజా అనగానే ముందు ఆమె జబర్దస్త్ నవ్వు ఆ వెనకనే ఆమె అందమైన రూపం కళ్ళ ముందు కొచ్చేస్తాయి. 

అవును రోజా, బహుముఖ ప్రజ్ఞావంతురాలు. హీరొయిన్ గా, నటిగా, యాంకర్ గా,అనేక రంగాలలో తన ప్రతిభాపాటవాలు ప్రదర్శించారు. ఇవన్నీ ఒకెత్తు అయితే,  అన్నింటినీ  మించి శ్రీమతి రోజా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పై ఈగ వాలినా సహించలేరు. జగనన్న అంటే రోజాకు అంత ఇదన్న మాట. జగనన్నకు కూడా అంతే సొంత సోదరి షర్మిలమ్మ కంటే దేవుడిచ్చిన చెల్లెలు రోజా అంటే ఎక్కువ ప్రేమ. అందుకే మంత్రి పదవి కోసం ఆమె పడ్డ తపనను చూసి తట్టుకోలేక, ఆమెకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. అందుకే ఆమె, రెట్టించిన ఉత్సాహంతో, జగనన్నను ఎవరన్నా ఏదన్నా అంటే, మరింతగా రెచ్చిపోతున్నారు. 

ఇంతవరకు తెలుగు దేశం నాయకుల మీద నోరు పారేసుకున్న రోజా, ఇప్పడు జనసేన అధినేత, పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ చేసిన నేరం ఏమిటంటే, ఎవరో చేసిన ఏదో సర్వే ఆధారంగా నెక్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపే ఓడి పోతుందని, ఆపార్టీకి 45 నుంచి 67 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పారు. నిజానికి, అంత మాత్రానికే, రోజా మేడం అంతలా అగ్గిమీద గుగ్గిలం ఎందుకయ్యారో ఆమెకే తెలియాలని ఆమె అనుచరులే అంటున్నారు. 

అయితే, ఆమె ఇలా రెచ్చి పోవడానికి ఇంకా ఎదో కారణం ఉందని,ఆమె కుర్చీ కిందకు నీళ్ళొచ్చాయని, అందుకే ఆమే జగనన్నను ప్రసన్నం చేసుకునేందుకే, ఎగస్ట్రా జబర్దస్త్ స్టైల్లో ఎగస్ట్రా ‘డైలాగ్స్’ తో విరుచుకు పడుతున్నారని అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇచ్చిన కిక్కులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రులకు గట్టిగా క్లాసు పీకారు.ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విజయసాయి రెడ్డితో పాటుగా, ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతి ప్రమేయం ఉందని విపక్షాలు ఆరోపించాయి. అయినా, ఆ ఆరోపణను మంత్రులు ఎవరూ ఖండించలేదు. మంత్రులకు ఏ నిజాలు తెలుసో ఏమో  కానీ, ఎవరికి వారు, మన కెందు కొచ్చిందిలే అని మౌనంగా ఉండి పోయారు.

సహజంగానే, ముఖ్యమంత్రికి కోపమొచ్చింది.మీకు మంత్రి పదవులు ఇచ్చింది ఎందుకు ఇందుకే కదా, నామీద, నా కుటుంబ సభ్యులపై ఇంతలేసి ఆరోపణస్తే ఖండించవలసిన బాధ్యత మీకు లేదా అంటూ మంత్రులపై మండి పడ్డారు. ఇలా అయితే లాభం లేదు,  మీ దారి మీది నా దారి నాదని హెచ్చరించారు. అంతేకాకుండా, ఇద్దరు మహిళా మంత్రులతో పాటుగా, మొత్తం నలుగురు మంత్రులకు ఉద్వాసన తపదని సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు.  ఆ నలుగురిలో ఫస్ట్ నేమ్. ఆర్కే రోజాదే అని పార్టీ వర్గాలే చెప్పాయి. అందుకే, ఇప్పుడు ఆమె, జబర్దస్త్ నుంచి ఎగస్ట్రా జబర్దస్త్  మించి మరింత రెచ్చి పోతున్నారని అంటున్నారు.