TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉండవల్లి శ్రీదేవి పోలిటికల్ కెరీర్ కు ఫుల్ స్టాపేనా?!

Published on: Tue Aug 23, 2022 10:21AM

నిత్యం వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ నామ జపం చేసు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రాజకీయ కెరీర్ కు ఫుల్ స్టాప్ పడినట్లేనా? అంటే వైసీపీ శ్రేణులు, పరిశీలకులు కూడా ఔననే అంటున్నారు. జగన్ ఏం మాట్లాడమంటే అదే మాట్లాడి, ఏం చేయమంటే అదే చేసిన ఉండవల్లి శ్రీదేవికి పార్టీలో ఒక్కసారిగా ఆదరణ లేకుండా పోవడం ఒకింత ఆశ్చర్యమే. ఎందుకంటే అసెంబ్లీ అయినా, బహిరంగ సభ అయినా.. సందర్బం ఉన్నా, లేకపోయినా ఉండవల్లి శ్రీదేవిది ఒకటే మాట.. ఒకటే నామస్మరణ.. జగన్.. జగన్.. జగన్. ఆపరేషన్ అయిన గుండె సైతం జగన్.. జగన్ .. జగన్ అని కొట్టుకొంటోందంటూ.. అంత జగన్ నామస్మరణ చేసిన శ్రీదేవికి తాను మాత్రం జ  జగన్నాటకంలో చిన్న పాత్ర మాత్రమేనని ఆలస్యంగా తెలుసుకున్నారు. అప్పటికే తాడికొండ నియోజకవర్గం పార్టీ అదనపు సమన్వయకర్తగా డొక్క మాణిక్య వర ప్రసాద్‌ పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసేసింది. దీంతో ఆ విషయం తెలుసుకొని.. తత్వం బోధపడి.. అంతా తెలుసుకునే సరికే జరగాల్సిన పని జరిగిపోయింది. నియోజవర్గంలోని లీడర్ నుంచి కేడర్ వరకు అందరిని వెంట పెట్టుకొని.. గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షురాలు మేకతోటి సుచరిత ఇంటి ముందు అర్ధరాత్రి ఆందోళనకు దిగి నినాదాలతో కొద్ది సేపు హడావుడి చేసిన శ్రీదేవి ఆ తరువాత ఓ అల్టిమేటం జారీ చేసి ఆందోళన విరమించారు.  పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ హోంమంత్రి సుచరిత నివాసం ముందు అర్ధరాత్రి ఉండవల్లి శ్రీదేవి ఆందోళన ఒక్కసారిగా సంచలనం రేపింది. దీంతో సుచరిత ఇంటి నుంచి బయటకు వచ్చి.. పార్టీ అధిష్ఠానంతో మాట్లాడదామని.. అధిష్టానం ఎలా ఆదేశిస్తే.. అలా నడుచుకుందామంటూ ఎమ్మెల్యే శ్రీదేవిని.. సముదాయించారు, దీంతో ఉండవల్లి ఆందోళన విరమించారు. అయితే 10 గంటల్లో పార్టీ నిర్ణయం మార్చుకోవాలని నియోజకవర్గ అదనపు సమన్వయ కర్తగా డొక్కా నియామకాన్ని వెనక్కు తీసుకోవాలనీ లేకుంటే నాలుగు మండలాల్లోని నాయకులంతా ముకుమ్మడి రాజీనామాలు చేస్తామని పార్టీ అధిష్టానానికి శ్రీదేవి వర్గంగా చెప్పుకుంటున్న ఆ నాలుగు మండలాల నాయకులు అల్టిమేటం ఇచ్చారు. 

అయితే ఇంతలా జగన్ నామస్మరణలో మునిగిపోయిన ఎమ్మెల్యే శ్రీదేవి పట్ల సీఎం జగన్ ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరించారన్న ఓ సందేహం ఆమె వర్గాన్ని పట్టి పీడిస్తోంది.   శ్రీదేవి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆరోపణలు, విమర్శలు గట్టిగానే ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకొని.. ముందుగానే ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి సీఎం జగన్ చెక్ పెట్టేసినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఆమెను సీఎం జగన్ దూరం పెడుతూ వచ్చారనీ, అందుకే ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తాడికొండ అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను సీఎం జగన్ ఏరి కొరి మరీ నియమించారనీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   మూమూలుగా ఎమ్మెల్యేలే వారి వారి నియోజకవర్గాల సమన్వయకర్తలుగా  వైసీపీలో వ్యవహరిస్తుంటారు. దీంతో ఇతరులను నియమించే అవకాశం ఉండదు... ఉండబోదు. కానీ తాడికొండలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీదేవి ఉండగానే.. అదనపు సమన్వయకర్తగా జగన్ డొక్కా మాణిక్యవరప్రసాద్ ను నియమించారు. 

 అయితే పార్టీ ఏం చెబితే అదే ఆమె చేశారని శ్రీదేవి అనుచరులు అంటున్నారు. ఆ క్రమంలోనే ఆమె అమరాతి రాజధానికి వ్యతిరేకంగా గళమెత్తారని... తమకు రాజధాని అవసరం లేదని స్పష్టం చేశారట. అలాగే  సొంత నియోజకవర్గంలోని రైతుల్ని సైతం పెయిడ్ ఆర్టిస్టులు అని అభివర్ణించారు. రాజధాని భూములన్నీ ఓ సామాజికవర్గానివే అని విమర్శలు సైతం గుప్పించారు. చివరికి ఫ్యాన్ పార్టీలో చోటు చేసుకున్న వర్గ పోరాటాల్ని సైతం టీడీపీకి అంటగట్టి కుల ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారారు.
 
అయితే ఎన్ని చేసినా జగన్ పార్టీలో శ్రీదేవికి సరైన గుర్తింపు లేకుండా పోయిందని ఆమె వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తరచు ఆమెపై వివాదాలు ముసురుతూ వచ్చాయని... డబ్బులు తీసుకుని ఎగ్గొట్టారని పలువురు సొంత పార్టీ నేతలు సైతం ఆరోపణలు ఆమెపై గుప్పించారు. ఇలా ఒకటా రెండో.. శ్రీదేవి చేసిన ఘన కార్యాలు గురించి చెప్పుకుంటే పొతే.. కొండవీటి చాంతాడంత ఉంటుందనే ఓ చర్చ  తాడికొండలో ఓ రేంజ్ లో సాగుతోంది.


అదీకాక.. తాడికొండ నియోజకవర్గం రాజధాని అమరావతి ప్రాంతంలో ఉంది. జగన్ అధికారంలోకి రావడంతో.. అమరావతి ఎగిరిపోయింది. దీంతో ఆమెకు ఇదే పెద్ద మైనస్ అయిందట. అలాగే నియోజకవర్గంలో ఆమె అభివృద్ధి చేసిన కార్యక్రమాలు కాగడా పట్టి వేదికనా కనిపించవని.. ఆ పార్టీ వారే పేర్కొంటునారు. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు అయినా.. నియోజకవర్గ ప్రజలకు అరకొరగానే అందుతున్నాయని తెలుస్తోంది. అసైన్డ్ రైతులకు కౌలు, పెన్షన్ 5 వేలు, టిడ్కో గృహాలు కేటాయింపుల్లో శ్రీదేవి చేసిందేమీ లేదనే ఓ చర్చ సైతం నేటికి ఉందట.  

 ఇలాంటి పరిణామాల నేపథ్యంలో శ్రీదేవికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తే.. పట్టిసీమ ప్రయాణంలో.. పడవ బోల్తా పడినట్లు తాడికొండ నియోజకవర్గ అసెంబ్లీ సీటు చేయి జారీ గల్లంతయ్యే అవకాశం ఉందని.. భావించిన సీఎం జగన్ ముందుగానే జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. అదీకాక.. తాడికొండ నియోజకవర్గం అదనపు సమన్వయకర్తగా తాజాగా నియమితులైన డొక్కా మాణిక్య వర ప్రసాద్.. గతంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి రెండు సార్లు గెలుపొంది మంత్రిగా కూడా పని చేశారు.

ఆ తర్వాత జగన్ పార్టీలో చేరదామనుకుని.. చివరి నిమిషంలో మనస్సు మార్చుకొని.. సైకిల్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్సీగా శాసనమండలిలో అడుగు పెట్టారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నుంచి మేకతోటి సుచరితపై పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం జగన్ పార్టీ అధికారంలోకి రావడంతో... మూడు రాజధానులు తెరపైకి రావడం.. దానికి వ్యతిరేకంగా టీడీపీతోపాటు ఎమ్మెల్సీ పదవికి సైతం డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేసేశారు.

ఆ తర్వాత ఆయన మళ్లీ.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోన చేరారు. అంతేకాదు.. ఇదే పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్సీగా శాసన మండలిలో అడుగు పెట్టారు. తాజాగా తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా డొక్కా నియమితులు కావడంతో.. తాడికొండ అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డొక్క అని ఇప్పటికే శ్రీదేవి అనుచర వర్గం   పక్కాగా ఫిక్స్ అయిపోయిందట. ఎంతైనా డొక్క.. వారు అనుకున్నారంటే.. అది సాధించే క్రమంలో విపక్షంలో అయినా.. స్వపక్షంలో అయిన..  ప్రత్యర్థి డొక్క చించి డొలు కడతాడనే ఓ టాక్ అయితే ఆయన అనుచరుల్లో నాటికే కాదు నేటికి అదే బలంతో బలంగా నడుస్తోంది.