TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పొలిటికల్ మైలేజి కోసమేనా కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలు ?

Published on: Thu Jul 21, 2022 3:27PM

నేషనల్‌ హెరాల్డ్‌-ఏజేఎల్‌ వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ, అలాగే అదే పార్టీకి చెందిన మరి కొందరు ముఖ్య నేతలపై మనీ లాండరింగ్‌ కేసు నమోదైంది. ఇది ఇప్పుడు నమోదైన కేసు కాదు, కాంగ్రెస్ హయాంలో, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న రోజుల్లో నమోదైన కేసు. అయితే, అప్పట్లో విచారణ లేకుండానే, విచారణ సంస్థలు కేసును కొట్టేశాయి.ఆ తర్వాత  సుభ్రమణ్య స్వామి కోర్టును ఆశ్రయించడంతో,కోర్టు ఆదేశాల  మేరకు ఈడీ విచారణ చేపట్టింది.  

ఈ నేపధ్యంలో కేసును విచారిస్తున్న ఎన్ఫోర్స్మెంట్  డైరెక్టరేట్,(ఈడీ) ఇతరులతో పాటుగా సోనియా గాంధీకి కూడా సమన్లు జారీ చేసింది. నిజానికి,  గత నెలలోనే ఈడీ నోటీసులు జారీ అయినా... అనారోగ్యం (కొవిడ్) కారణంగా ఆమె, అప్పుడు ఈడీ విచారణకు హాజరు కాలేక పోయారు. వాయిదా కోరారు.ఈడీ ఆమె కోరిన విధంగా వాయిదాకు అంగీకరించి, తాజాగా జులై 21, 22 తేదీల్లో విచారణకు హాజరు కావాలని మరో మారు సమన్లు జారీ చేసింది.ఈ నేపధ్యంలో, ఆమె ఈ రోజు ( జులై  21) ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు.  

అయితే, సోనియా గాంధీ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోది. కేంద్ర ప్రభుత్వం విచారణ సంస్థల ద్వారా రాజకీయ వేధింపులకు దిగుతోందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఒకక్ కాంగ్రెస్ నాయకులే కాదు, ప్రతిపక్షాలు అన్నీ అదే ఆరోపణ చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్సనలు నిర్వహిస్తున్నారు. గతంలో ఇదే కేసులో రాహుల్ గాంధీని విచారించిన సమయంలోనూ కాంగ్రెస్ శ్రేణులు దేశ వ్యాప్తంగా ఇదే తరహ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

అయితే, కేసు ఏమిటి? విచారణ ఏమిటి? తీర్పు ఎలా ఉంటుంది? చివరకు ఎమి జరుగుతుంది, ఏమి జరగదు, అనే విషయాలను పక్కన పెడితే, కాంగ్రెస్ శ్రేణులు నిర్వహిస్తున్న నిరసన ప్రదర్శనలు, ఆందోళనల వలన పార్టీకి కలిగే రాజకీయ ప్రయోజనం ఏమిటి, అనే విషయంలో రాజకీయ వర్గాల్లో , ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  గతంలో మాజే ప్రధాని పీవీ నరసింహ రావు, ఇతర నేతలు కూడా సీబీఐ,ఈడీ, ఎన్ఐఎ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ ఎదుర్కున్నారు.

గోద్రా అనంతర గుజరాత్ అల్లర్ల కేసులో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ , ‘సిట్’ (ప్రత్యేక దర్యాప్తు సంస్థ) ఎదుట, గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో రోజుల తరబడి విచారణకు హాజరయ్యారు. ఇంకా విచారణను హుందాగా ఎదుర్కున్న నాయకులు చాలా మందే ఉన్నారు. కానీ, అప్పట్లో పార్టీ మొత్తంగా వీధుల్లోకి రాలేదు. నిరసన ర్యాలీలు నిర్వహించిన దాఖలాలూ లేవు. చట్టాన్ని గౌరవించారు. నిజానికి, ఇదే నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, పార్టీ మరో సీనియర్ నేత పవన్ బన్సల్ ను కూడా ఈడీ విచారించింది. అయినా, ఖర్గే , బన్సల్ విచారణకు కాంగ్రెస్ అభ్యంతరం చెప్పలేదు. నిరసన ప్రదర్శనలు చేయలేదు. అసలు విచారణ ఎప్పుడు జరిగిందో కూడా ఎవరికీ తెలియకుండా విచారణ పూర్తయింది.

కానీ, రాహుల్ గాంధీని విచారించిన ఐదు రోజులూ కాంగ్రెస్ పార్టీ దెశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. ఇప్పడు మళ్ళీ సోనియా  గాంధీ విచారణ సందర్భంగా, పార్టీ  సీనియర్ నేతలంతా రోడ్డు మీదకు వచ్చారు. అయితే, ఈనిరసన ప్రదర్శనల వలన విచారణ సంస్థలు ప్రభావితం అవుతాయా అంటే, అలాంటి అవకాశం కనిపించడం లేదు. అలాగే, నిరసన ప్రదర్శనల ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆశిస్తున్న పొలిటికల్ మైలేజి అయినా వస్తుందా, అంటే  అదీ అనుమానమే అంటున్నారు.