TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీబీఐ అటు నుంచి నరుక్కొస్తోందా?!

Published on: Mon Jul 25, 2022 2:51PM

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు దర్యాప్తులో తిరిగినన్ని, తిరుగుతున్నన్ని మలుపులు గతంలో ఏ కేసులోనూ జరిగి ఉండక పోవచ్చు. 2019 ఎన్నికలకు ముందు ఈ హత్య జరిగింది.

తన సొంత ఇంట్లో వివేకా హత్యకు గురయ్యారు. అప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. వివేకా అన్న కొడుకు వైఎస్ జగన్ విపక్ష నేత. వివేకా మరణించారన్న వార్త బయటకు రాగానే ఆయన గుండె పోటుతో మరణించారంటూ జగన్, ఆయన అనుచరులు విజయసాయి తదితరులంతా ఒకరి తరువాత ఒకరు ప్రకటనలు గుప్పించేశారు. గంటల వ్యవధిలోనే వివేకా గుండె పోటుతో మరణించలేదు... ఆయన హత్యకు గురయ్యారన్నది వెల్లడైంది. అంతే జగన్ తదితరులందరి స్వరం మారిపోయింది. చంద్రబాబు, లోకేష్ ల హస్తం ఈ హత్య వెనుక ఉందంటూ విమర్శలు గుప్పించి.. ఎన్నికలలో సానుభూతి పవనాల కోసం తమ వంతు ప్రయత్నం చేసేశారు. ఆయన హత్యపై సీబీఐ విచారణకు స్వయంగా జగన్ డిమాండ్ చేశారు.

సరే ఆ తరువాత జగన్ ఎన్నికలలో విజయం సాధించారు. ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత తన సొంత బాబాయ్ వివేకా హత్య కేసు విచారణను నీరుగార్చే ప్రయత్నాలు ప్రారంభించారు. బాబాయ్ హత్యపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన ఆయనే అధికారంలోకి వచ్చాకా సీబీఐ విచారణ అవసరం లేదని అన్నారు. అయితే వివేకా కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి మాత్రం తన తండ్రి హత్య కేసులో  సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు అందుకు అంగీకరించి కేసును సీబీఐకి అప్పగించింది. అయితే ఏపీలో సీబీఐ అయినా, అంత కంటే గోప్ప సంస్థైనా సరే చేయగలిగేదీ ఏదీ ఉండదని జగన్ సర్కార్ హయాంలో నిర్ద్వంద్వంగా రుజువైపోయింది.

కేసు దర్యాపు వేగంగా జరుగుతున్న సమయంలో సీబీఐకి బెదరింపులు వచ్చాయి. సీబీఐ అధికారులపైనే ప్రైవేటు కేసులు దాఖలయ్యాయి. వీటన్నిటి వెనుకా ఉన్నది వివేకా హత్య విచారణ సజావుగా సాగకుండా ఆపే యత్నమే. దీంతో గత కొంత కాలంగా సీబీఐ ఈ హత్య కేసు విషయంలో సైలెంటైపోయింది. అంతకు ముందు ఈ హత్య కేసులో అరెస్టయిన ఎవన్ ముద్దాయి ఎర్రగంగిరెడ్డి బెయిలు  రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అప్పటికే వివేకా హత్య కేసులో అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న సీబీఐ విచారణ విషయంలో హఠాత్తుగా మౌనం వహించింది.

ఈ క్రమంలోనే ఈ కేసులో  కొందరు సాక్షులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ పరిస్థితుల్లో గత కొంత కాలంగా మౌనంగా ఉన్న సీబీఐ హఠాత్తుగా ఎర్ర గంగిరెడ్డి బెయిలు రద్దు కోరుతూ సుప్రీంను ఆశ్రయించింది. ఎర్రగంగిరెడ్డి బెయిలుపై ఉంటే సాక్షులను బెదరించే, ప్రభావితం చేసే అవకాశాలున్నాయని ఆ పిటిషన్ లో పేర్కొంది. దీంతో ఇక వివేకా హత్య కేసు విచారణ వేగవంతం య్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసు విచారణలో ఎర్రగంగిరెడ్డి బెయిలు పిటిషన్ పై సుప్రీం నిర్ణయం అత్యంత కీలకం కానున్నద.