TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఢిల్లీ హత్యాచార నిందితుడు మామూలోడు కాదు.. విస్తుపోయే విషయాలు!

Published on: Thu Apr 23, 2026 4:15PM

 

ఢిల్లీలో సీనియర్ ఐఆర్‌ఎస్ ఆఫీసర్ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడి, వారి నివాసంలోనే హత్య చేసిన నిందితుడు రాహుల్ క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ చూసి పోలీసులే నోరెళ్ల పెడుతున్నారు . దేశ రాజధాని అమర్ కాలనీలో బుధవారం ఉదయం గతంలో వారి ఇంట్లో పనిచేసిన యువకుడే అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపేశాడు. ఐఆర్ఎస్ అధికారి, ఆయన భార్య ఉదయం జిమ్‌కు వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వారి కుమార్తె ఒక్కరే ఇంట్లో ఉండగా.. టెర్రస్‌పై ఉండే ఆమె గదిలోకి నిందితుడు చొరబడి ఘాతుకానికి పాల్పడ్డాడు. 

దీనికి కొద్ది గంటల ముందు మరో మహిళపై అత్యాచారం చేశాడని విచారణలో వెల్లడైంది. నిందితుడు రాజస్థాన్‌లోని అల్వార్‌లో తన స్నేహితుడి భార్యపై అత్యాచారం చేసి.. ఆమెను హత్య చేయడానికి ప్రయత్నించినట్టు బయటపడింది. అక్కడ నుంచి అంబులెన్స్‌లో ప్రయాణించి ఢిల్లీకి చేరుకున్నాడని పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. అల్వార్‌ జాతీయ రహదారిపై అంబులెన్స్ ఎక్కిన నిందితుడు.. డ్రైవర్‌కు రూ.5,000-రూ.6,000 ఇస్తానని అన్నాడు. కానీ, ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఆ డబ్బు ఇవ్వకుండా పారిపోయాడు. స్నేహితుడి భార్యపై అత్యాచారం చేసి, ఆమెను గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించిన కొన్ని గంటల తర్వాతే అతను ఈ ప్రయాణం చేశాడని పోలీసులు భావిస్తున్నారు. 

ఈ ఘటనపై కేసు నమోదుచేసి.. రాజస్థాన్, ఢిల్లీ పోలీసులు ప్రస్తుతం సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం రాత్రి నిందితుడు తన ఇంట్లోకి బలవంతంగా చొరబడి, లైంగిక దాడి చేసి, కరిచి, గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించాడని అల్వార్ బాధితురాలు ఆరోపించింది. ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే తన భర్త, పిల్లలను చంపేస్తానని కూడా రాహుల్ బెదిరించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి భర్త బంధువుల వివాహం కోసం సొంతూరుకు వెళ్లగా.. ఇద్దరు పిల్లలతో ఆమె అల్వార్‌లోనే ఉందని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. 

ఈ ఘటన జరిగిన వెంటనే తమకు ఫిర్యాదు అందిందని, వెంటనే కేసు నమోదు చేశామని అల్వార్ పోలీసులు తెలిపారు.  అక్కడ నుంచి ఢిల్లీకి చేరుకున్న తర్వాత నిందితుడు తాను గతంలో పనిచేసిన దక్షిణ ఢిల్లీలోని ఐఆర్ఎస్ అధికారి నివాసానికి వెళ్లాడు. గతంలో అక్కడ పనిచేసి ఉండటంతో ఆ ఇంటి గురించి అతడికి బాగా తెలుసని దర్యాప్తు అధికారులు తెలిపారు. నిందితుడు హత్యాచారం తర్వాత ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో సుమారు రూ. 2.5 లక్షలు దొంగిలించినట్లు తెలుస్తోంది.