TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సోషల్ మీడియా దుష్ప్రచారంపై ఉక్కుపాదం.!

Published on: Tue Jul 7, 2026 1:15PM

సోషల్ మీడియా వేదికగా వ్యవస్థీకృత దుష్ప్రచారానికి పాల్పడే వారిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, అశ్లీల పోస్టులు పెడుతూ, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారాలకు ఒడిగట్టే శక్తులపై ఉక్కుపాదం మోపాలని హోంమంత్రి వంగలపూడి అనిత పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.

మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి డీజీపీతో కలిసి ఆమె అన్ని జిల్లాల ఎస్పీలు, రేంజ్ డీఐజీలు, ఐజీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై మంత్రి  అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలను అరికట్టడానికి,  వ్యవస్థీకృత నేరగాళ్లను పట్టుకోవడానికి హోంమంత్రి కీలక సూచనలు చేశారు. ఫేక్ న్యూస్,  అసభ్యకర పోస్టుల వెనుక ఉన్న నెట్‌వర్క్‌లను ఛేదించడానికి  నెట్‌వర్క్ ఆధారిత దర్యాప్తు ముమ్మరం చేయాలన్నారు. అలాగే..  రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో  సైబర్ గార్డ్ యూనిట్లు,  సోషల్ మీడియా పర్యవేక్షణ విభాగాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

రిపీటెడ్ అఫెన్సెస్ కు పాల్పడే వారిపై,  సమాజంలో అభద్రతా భావాన్ని సృష్టించే వారిపై చట్టప్రకారం కఠిన  చర్యలు తీసుకోవాలని మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. అలాగే అదే సమయంలో అంటే.. వ్యవస్థీకృత దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకునే క్రమంలో.. రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య చర్చలకు,  చట్టబద్ధమైన విమర్శలకు ఎలాంటి భంగం కలగకుండా పోలీసులు వ్యవహరించాలని స్పష్టం చేశారు.  రాష్ట్రంలో సోషల్ మీడియా దుష్ప్రచారానికి సంబంధించి గత రెండేళ్లలో 1,665 కేసులు నమోదయ్యాయని,  హానికరమైన, అలాగే  అసత్య ప్రచారాలకు సంబంధించిన 12 వేల  వెబ్‌లింక్‌లను  సహయోగ్   ద్వారా ఇప్పటికే తొలగించినట్లు పోలీసు అధికారులు ఈ సందర్భంగా హోంమంత్రికి వివరించారు.రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సోషల్ మీడియాను వాడుకుంటే ఊపేక్షించేది లేదని, అవసరమైతే అసత్య ప్రచారాలను నియంత్రించడానికి ప్రభుత్వం త్వరలోనే ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకురావడానికి ఆలోచిస్తోందని మంత్రి చెప్పారు.