TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కువైట్ లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు

Published on: Wed Jun 3, 2026 9:07AM

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ భయం గుప్పిట చిక్కుకుంది. గల్ఫ్ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి. బుధవారం (మే 3) తెల్లవారుజామున ఇరాన్ సాయుధ దళాలు కువైట్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ ఎత్తున క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాలే ప్రధాన లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది.  అయితే, ఈ  దాడిని కువైట్ వాయు రక్షణ వ్యవస్థ (ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్) సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇరాన్ ప్రయోగించిన   క్షిపణులను, డ్రోన్లను కువైట్ సైన్యం గాల్లోనే విజయవంతంగా పేల్చివేసింది.

తమ సైనిక సిబ్బందిని రక్షించుకోవడంలో వాయు రక్షణ దళాలు కీలక పాత్ర పోషించాయని అమెరికా సెంట్రల్ కమాండ్  (సెంట్కామ్ )స్పష్టం చేసింది. అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులను గాల్లోనే అడ్డుకున్నామని, ఈ ఘటనలో అమెరికా దళాలకు ఎలాంటి ప్రాణనష్టం,  ఆస్తి నష్టం సంభవించలేదనీ సెంట్కామ్ అధికారిక ప్రకటనలో ధ్రువీకరించింది.ఈ దాడి నేపథ్యంలో కువైట్ సైన్యం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది.  కువైట్ ఆకాశంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించడంతో సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. శిథిలాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలందరూ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని, ఆకాశం నుంచి కూలిపోయిన వస్తువులు లేదా క్షిపణి అవశేషాల వద్దకు ఎవరూ వెళ్లవద్దని కువైట్ రక్షణ శాఖ  హెచ్చరికలు జారీ చేసింది.

మరోవైపు,  ఇటీవల తమ దేశానికి చెందిన కీలకమైన రాడార్ వ్యవస్థలు, డ్రోన్ సైట్లపై అమెరికా మిలిటరీ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే తాము ఈ దాడులకు పాల్పడ్డామని ఇరాన్ ప్రభుత్వ మీడియాపేర్కొంది.  కువైట్‌లో మోహరించిన అమెరికాకు చెందిన ఐదో ఫ్లీట్ ,  ప్రధాన ఎయిర్ బేస్‌ను పూర్తిగా ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఈ  దాడులు నిర్వహించామని ఇరాన్ సైనిక వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామంతో గల్ఫ్ రీజియన్‌లో ఏ క్షణంలోనైనా పూర్తి స్థాయి యుద్ధం సంభవించవచ్చనే ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా ఇరాన్ క్షిపణి దాడులు జరిగిన సమయంలోనే, హర్మూజ్ జలసంధిలోని వ్యూహాత్మక ఖెష్మ్ దీవి ప్రాంతంలోనూ భారీ పేలుళ్లు సంభవించడం   కలకలం రేపింది.

ఇరాన్ ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతంలో వరుసగా భారీ శబ్దాలు వినిపించినట్లు   మీడియా పేర్కొంది. అయితే ఈ అంతర్గత పేలుళ్లకు గల అసలు కారణాలు ఏమిటనే దానిపై  స్పష్టత లేదు. ఇరాన్ దాడుల ప్రకంపనలతో పొరుగునే ఉన్న బహ్రెయిన్ దేశంలోనూ అర్ధరాత్రి యుద్ధ సైరన్లు మోగాయి. బహ్రెయిన్ సైన్యం కూడా తమ రక్షణ వలయాలను అప్రమత్తం చేసింది.ఇరాన్ అనాలోచిత చర్యలను కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. ప్రాంతీయ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఇరాన్ వ్యవహరిస్తోందని మండిపడింది. ఈ తాజా సైనిక ఉద్రిక్తతల కారణంగా పశ్చిమాసియాలో జరుగుతున్న అంతర్జాతీయ శాంతి చర్చలకు ఆటంకం ఏర్పడింది.