పంజాబ్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ గెలుపు
posted on Apr 15, 2013 8:18AM
ఐపిఎల్-6 లీగ్ మ్యాచ్ లలో భాగంగా పంజాబ్ కింగ్స్ ఎలెవెన్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ నిలకడైన బ్యాంటింగ్ తో తక్కువ స్కోరును ఛేదించి గెలుపు సొంతం చేసుకుంది. టాస్ గెలిచి రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ 10 ఓవర్లలో కీలకమైన 3 వికెట్లు కోల్పోయింది. రాజస్థాన్ బౌలర్ శ్రీశాంత్ వేసిన రెండో ఓవర్లో పంజాబ్ కెప్టెన్ ఆడమ్ గ్రిల్ క్రిస్ట్ (0), మన్ దీప్ (2) పరుగుల చేసి ఔటయ్యారు. మరుసటి ఓవర్లో లేని పరుగుకు ప్రయత్నించిన వోహ్రా (3) రనౌట్ అయ్యాడు. మైఖేల్ హస్సీ, గురుకీరత్ లు నిలకడగా ఆడుతూ స్కోరు పెంచే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ 31 బంతుల్లో 35 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పంజాబ్ ఇన్నింగ్స్ లో హస్సీ (41) ఒక్కడే అత్యధిక స్కోరు చేశాడు. పంజాబ్ ఇన్నింగ్స్ చివర్లో ప్రవీణ్ కుమార్ 7 బంతుల్లో 15 పరుగులు (2ఫోర్లు, 1 సిక్స్) చెలరేగి ఆడడంతో పంజాబ్ 124 పరుగులైనా చేయగలిగింది. పంజాబ్ ఇన్నింగ్స్ లో గురుకీరత్ 10, సతీష్ 11, అజార్ మెహమూద్ 23, చావ్లా 7, పర్మిందర్ ఆవానా 0, హారీస్ 2 నాటౌట్ గా నిలిచాడు. శ్రీశాంత్ 2, కెవోన్ కూపర్ 2, ఫాల్కనర్ 2, తివేది 2 వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ వాట్సన్ దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. వాట్సన్ 19 బంతుల్లో 32 పరుగులు (7 బౌండరీలు) చేసిన తరువాత ఆవానా బౌలింగ్ లో మన్ దీప్ క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. ద్రావిడ్ 9, బిన్నీ 0 లను ప్రవీణ్ కుమార్ ఒకే ఓవర్లో పెవిలియన్ కు పంపాడు. ఒక పక్క వికెట్లు పడిపోతున్నా ఓపెనర్ రహానే నిలకడగా ఆడుతూ రాజస్థాన్ రాయల్స్ ను నాలుగు బంగులు మిగిలి వుండగానే 126 పరుగల విజయలక్ష్యాన్ని ఛేదించాడు. హాడ్జ్ 15, శ్యామ్ సన్ 23 బంతుల్లో 27 పరుగులు (3 బౌండరీలు)తో అజేయంగా నిలిచాడు. రహానే 42 బంతులలో 34 పరుగులు (3బౌండరీలు) లతో నాటౌట్ గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో ప్రవీణ్ 2, ఆవానా 1, పియూష్ చావ్లా 1 వికెట్లు పడగొట్టారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఫాల్కనర్ నిలిచాడు.