ఇంటర్మీడియట్ లో నిజంగా కృష్ణాజిల్లా ఫస్టేనా?
Published on: Wed Apr 25, 2012 11:05AM
ఇటీవల ప్రకటించిన మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో, 24వ తేదీన ప్రకటించిన ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో కృష్ణాజిల్లా ప్రథమస్థానంలో ఉన్నట్లు విద్యాశాఖా మంత్రి కె.పార్థసారథి ప్రకటించారు. కృష్ణాజిల్లా మొదటి స్థానంలో నిలవడానికి కారణమైన విద్యార్థులందరూ కార్పోరేట్ కాలీజీలకు చెందినవారే. చైతన్య, నారాయణ, గాయత్రి వంటి సంస్థలు కృష్ణాజిల్లా విజయవాడ నగరంలో వున్నప్పటికీ ఈ సంస్థలలో చదివిన విద్యార్థులందరూ కృష్ణాజిల్లాకు చెందినవారు కాదు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ చేరుతుంటారు. తెలంగాణా ఉద్యమం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణా ప్రాంతానికి చెందిన విద్యార్థులు కూడా విజయవాడలోని సంస్థలలో ఎక్కువగా చేరారు.
విజయవాడ నుంచి పరీక్షలు రాసేవారిలో దాదాపు 80 శాతం మంది ఇతర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు. అయితే ఏ ప్రాంతం నుంచి వచ్చినా వారు విజయవాడ కేంద్రం నుంచి పరీక్షలు రాశారు కాబట్టి వారు కృష్ణాజిల్లాకు చెందినవారిగా పరిగణిస్తున్నారు. పరీక్షా ఫలితాలలో కృష్ణాజిల్లా ఫస్ట్ వచ్చినట్టు సంతోష పడుతున్నప్పటికీ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు వాస్తవంగా ఏ ప్రాంతానికి చెందినవారో తెలుసుకొంటే అసలు విషయం బయటకు వస్తుంది.


