TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నెల్లూరులో మహానాడుకి స్థలాల పరిశీలన

Published on: Fri May 1, 2026 4:22PM

 

నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు నిర్వహణకు కసరత్తులు వేగవంతమయ్యాయి. మహానాడుకు అనువైన స్థలాల ఎంపికలో భాగంగా పార్టీ నేతలు విస్తృతంగా పరిశీలనలు చేపట్టారు. కోవూరు జాతీయ రహదారి సమీపంలోని రాజుపాలెం పరిసరాల్లో ఉన్న ఇఫ్కో భూములు, అలాగే బొడ్డువారిపాలెం వద్ద ఉన్న సుమారు 110 ఎకరాల విస్తీర్ణాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నేతృత్వంలో పరిశీలించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కాకర్ల సురేష్, కృష్ణారెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహణకు అనువైన ప్రదేశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. రాజుపాలెం సమీపంలోని ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా స్థలాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. నెల్లూరు రూరల్, సర్వేపల్లి నియోజకవర్గాల్లో కూడా అనువైన స్థలాలపై పరిశీలన కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. 

అన్ని ప్రదేశాలను పరిశీలించిన అనంతరం వివరాలను కేంద్ర పార్టీకి నివేదిస్తామని, అనంతరం కేంద్ర టీమ్ మరోసారి పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. మహానాడు నిర్వహణకు సరైన వసతులు, రవాణా సౌకర్యాలు, విస్తీర్ణం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని తుది స్థలాన్ని ఎంపిక చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు మరింత వేగం పుంజుకున్నాయి.