భారత్ ప్రపంచకప్‌ జట్టు.. ఆ ఇద్దరికీ నో ప్లేస్

 

వచ్చే నెలలో ఇంగ్లాండ్‌  వేదికగా ఆరంభమయ్యే ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌ కోసం తలపడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని భారత  సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ.. ముంబయిలో సమావేశమైంది. ఈ సమావేశానికి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, చీఫ్ కోచ్ రవిశాస్త్రి సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రపంచకప్‌లో ఆడే 15 మందితో కూడిన టీమిండియా జట్టును మీడియాకు ప్రకటించారు.

నేడు ప్రకటించిన జట్టులో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌గా రోహిత్ శర్మ పేరును ప్రకటించారు. వీరితో పాటు ఎంఎస్ ధోనీని ప్రధాన కీపర్‌గా, సెకండరీ కీపర్‌గా దినేశ్ కార్తీక్‌ని జట్టులోకి తీసుకున్నారు. ఇక రిజర్వ్ ఓపెనర్‌గా కేఎల్ రాహుల్‌కి జట్టులో చోటు కల్పించారు. ప్రధాన పేసర్లగా భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలను, స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, యుజవేంద్ర చాహల్‌లను తీసుకున్నారు.. విజయ్ శంకర్, కేదార్ జాదవ్, హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలను ఆల్ రౌండర్లుగా జట్టులోకి తీసుకున్నారు. అయితే ఈ జట్టులో రిషభ్‌ పంత్‌, అంబటి రాయుడికి చోటు దక్కలేదు.

టీమిండియా జట్టు:
విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), ధోనీ, శిఖర్‌ ధావన్‌, కేదార్‌ జాదవ్‌, విజయ్‌ శంకర్‌, కేఎల్‌ రాహుల్‌, దినేశ్‌ కార్తీక్‌, చాహల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్దీప్‌యాదవ్‌, బుమ్రా, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీ