సరిహద్దుల్లో 50 మీటర్ల సొరంగం...

 

జమ్ము - కాశ్మీర్‌లోని భారత - పాకిస్థాన్ సరిహద్దుల్లో 50 మీటర్ల పొడవున్న ఒక సొరంగాన్ని భారత సైనికులు కనుగొన్నారు. పాకిస్థాన్‌లోంచి తీవ్రవాదులను ఈ సొరంగ మార్గం ద్వారా భారతదేశంలోకి పంపించడానికే ఈ సొరంగాన్ని తవ్వుతున్నారని సైనికులు అనుమానిస్తున్నారు. జమ్ము కాశ్మీర్‌లోని అత్యంత సున్నితమైన ఫల్లన్ వాలా సెక్టార్లో ఈ సొరంగాన్ని భారత సైనికులు కనిపెట్టారు. అయితే ఈ సొరంగం అసంపూర్తిగా వుంది. ఇద్దరు మనుషులు పాక్కుంటూ ప్రయాణం చేయడానికి వీలుగా ఈ సొరంగం వుంది. ఈ ప్రాంతంలో తీవ్రవాదులు, పాకిస్థాన్ సైనికులు మందుపాతరలు అమర్చి వుంటారన్న అనుమానాలు వుండటం వల్ల మరింత లోతుగా ఈ ప్రాంతాన్ని పరిశీలించడానికి కొంత సమయం పట్టవచ్చని భారత సైన్యం భావిస్తోంది.