కశ్మీర్ వ్యవహారంలో పాక్ కి మరో గట్టి షాక్!!
posted on Aug 10, 2019 12:16PM
కశ్మీర్ వ్యవహారంలో పాకిస్తాన్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కశ్మీర్పై మధ్యవర్తిత్వం కోసం చేసిన పాక్ అభ్యర్థనను ఐక్యరాజ్యసమితి తోసిపుచ్చింది. ఇప్పుడు తాజాగా రష్యా కూడా భారత చర్యనే సమర్థించింది. అది అంతర్గత వ్యవహారమని, భారత రాజ్యంగబద్ధంగానే కశ్మీర్లో మార్పులు జరిగాయని పేర్కొంది. ఈ సందర్భంగా రష్యా కూడా శిమ్లా ఒప్పందం గురించే ప్రస్తావించింది.
‘జమ్ముకశ్మీర్ హోదా మార్పు, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం అనేది భారత రాజ్యాంగ విధివిధానాలకు లోబడే జరిగింది. ఈ నిర్ణయాల వల్ల భారత్, పాక్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తం కాకుండా రెండు దేశాలు సంయమనం పాటిస్తాయని విశ్వసిస్తున్నాం. 1972 నాటి శిమ్లా ఒప్పందంలోని నిబంధనలకు అనుగుణంగా రాజకీయ, దౌత్యపరమైన ద్వైపాక్షిక చర్చల ద్వారానే ఆ దేశాల మధ్య విభేదాలు పరిష్కారమవుతాయి’ అని రష్యా విదేశాంగ వ్యవహారాల కార్యాలయం పేర్కొంది. దీనిబట్టి చూస్తుంటే.. ఒకవేళ కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో పాక్ ప్రస్తావించినా భారత్కు రష్యా మద్దతు లభిస్తుందనేది స్పష్టమవుతోంది.