TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రేణు దేశాయ్‌‌పై అసభ్య కామెంట్స్...నిందితుడు అరెస్టు

Published on: Wed Apr 8, 2026 8:21PM

 

సోషల్ మీడియా వేదికలో అభ్యంతరకరంగా, దూషణాత్మకంగా వ్యాఖ్యలు పోస్టు చేసిన వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆన్‌లైన్ వేదికలను దుర్వినియోగం చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. పోలీసులు ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విచారణలో గుంటూరు నివాసి చెన్నయ్య రంజాల ఈ వ్యాఖ్యలు చేసినట్లు గుర్తించారు. నిందితుడు తన ఖాళీ సమయంలో తరచూ యూట్యూబ్ లో రీల్స్ వీక్షిస్తుండేవాడని, ఇటీవల నటి రేణు దేశాయ్ కి సంబంధించిన ఒక రీల్ చూసిన అనంతరం తన యూట్యూబ్ ఖాతా ద్వారా ఇష్టానుసారంగా దూషిస్తూ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు పోస్టు చేసినట్లు అధికారులు గుర్తించారు.


దర్యాప్తు అనంతరం నిందితుడిని గుంటూరు లో అరెస్టు చేసి, అరెస్టుకు గల కారణాలను తెలియజేశారు. అనంతరం అతడిని గచ్చిబౌలి లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణలో భాగంగా ఆ వ్యాఖ్యలు పోస్టు చేసిన మొబైల్ ఫోన్‌ను నిందితుడి వద్ద నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు పలు సూచనలు జారీ చేశారు.

సోషల్ మీడియాను బాధ్య తాయుతంగా వినియోగించాలని, దూషణాత్మక లేదా పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు పోస్టు చేయకుండా జాగ్రత్త వహించాలని కోరారు. ఇటువంటి చర్యలు చట్టపరమైన పరిణామాలకు దారితీస్తాయని హెచ్చరించారు. అలాగే, ఏవైనా సైబర్ నేరాలు గమనించిన వెంటనే సమీప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలనీ లేదా 1930 సైబర్ హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.