మంత్రి పదవి రాకుంటే.. ముఖ్యమంత్రిని అవుతా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Published on: Sat Feb 14, 2026 8:07AM
.webp)
మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మరో సారి సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా పెను చర్చకు, వివాదానికీ దారితీసే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. యాదాద్రిలో శుక్రవారం (ఫిబ్రవరి 13) జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రానున్న రోజుల్లో తనకు మంత్రి పదవి తప్పక వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు.
ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే, ముఖ్య మంత్రిగా ఎదగడానికైనా వెనుకాడనంటూ సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. మునుగోడు మీరు చూసుకోండి… తెలంగాణ నేను చూసుకుంటా అంటూ ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. తనకు అడుక్కోవడం రాదన్న ఆయన.. పార్టీ తనకు ఇచ్చిన మాటకు కట్టుబడి మర్యాదగా మంత్రి పదవి డిమాండ్ చేశారు. అలా ఇవ్వకుంటే లాక్కునే స్థాయికి వెడతానని హెచ్చరించారు.
రాష్ట్రంలో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనుందన్న వార్తల నేపథ్యంలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మంత్రి పదవుల కేటాయింపుపై ఇప్పటికే అనేక ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో కోమటిరెడ్డి రాజశేఖరరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది.
రాబోయే రోజుల్లో మంత్రివర్గ విస్తరణపై పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తికరంగా మారింది.


