TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మారిన్ పై మస్తు కోపమొచ్చేది.. స్టార్ షట్లర్ పీవీ సింధు ఎమోషనల్ పోస్టు!

Published on: Sat Mar 28, 2026 4:12PM

మహిళల బ్యాడ్మింటిన్ లో కరోలినా మారిన్ రిటైర్మెంట్ తో ఒక శకం ముగిసింది.  స్పెయిన్ తరపున అంతర్జాతీయ వేదికలపై తిరుగులేని ఆధిపత్యం చలాయించిన దిగ్గజ క్రీడాకారిణి కరోలినా మారిన్  మోకాలి గాయాల కారణంగా  బ్యాట్మింటిన్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.  తనదైన శైలిలో స్మాష్ లతో, ఫోర్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్ ర్యాలీలతో ఆటపై తనదైన ముద్ర వేసిన ఈ స్పెయిన్ భామ రిటైర్మెంట్ పై భారత ఏస్ షట్లర్, ఒలింపిక్ మెడల్ విజేత పీవీ సింధు స్పందించింది.  

కరోలినా మారన్ కు దీటైన ప్రత్యర్థిగా గుర్తింపు పొందిన పీవీ సింధూ సోషల్ మీడియా వేదికగా కరోలినాతో తన అనుబంధం గురించి ఆసక్తికర అంశాలను షేర్ చేసింది.  తన క్రీడా ప్రయాణంలో  తనకు అత్యంత ఇష్టమైన ప్రత్యర్థి కరోలినా మారిన్ అని పేర్కొన్న సింధూ.. మైదానంలో తామిద్దరం తలపడిన ప్రతిసారీ గట్టి పోటీ నడిచేదని పేర్కొంది.  మ్యాచ్ జరుగుతుండగా కరోలినా తీరు ప్రత్యర్థిని తప్పుదోవపట్టించేదిగా ఉంటుందని సింధూ పేర్కొన్నారు. ఆ విషయంలో కరోలినా పై తనకు విపరీతమైన కోపమొచ్చేదని చెప్పారు. ఆమె అరుపులూ, రెచ్చగొట్టి, ప్రత్యర్థి ఏకాగ్రతను దెబ్బతీసే ఎత్తుగడల పట్ల తను కోపగించుకున్న విషయాన్ని సింధు ఆ పోస్టులో వివరించింది. అయితే ఆట ముగిసన తరువాత మాత్రం ఇద్దరం మంచి స్నేహితులమని పేర్కొంది.

గతంలో మాడ్రిడ్ లో కరోలినాతో కలిసి కాఫీ తాగుతూ సరదాగా గడిపిన క్షణాలను కూడా సింధూ ఆ పోస్టులో గుర్తు చేసుకుని వివరించింది.  2016 రియో ఒలింపిక్స్ ఫైనల్స్‌లో సింధుపై విజయం సాధించి కరోలినా మారిన్ స్వర్ణం గెలవగా, 2018 ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్లోనూ సింధుకు కరోలినా మారిన్ చుక్కలు చూపించింది.

ఈ రెండు ప్రధాన టోర్నీలలో ఓటమి పాలైనప్పటికీ, ఆ చేదు జ్ఞాపకాలను దాటి వారిద్దరి తమ మధ్య  స్నేహం చిగురించిందని సింధు పేర్కొంది.  ప్రస్తుతం కరోలినా మారిన్ పై సింధు సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టు తెగ వైరల్ గా మారింది.  క్రీడాకారుల మధ్య ఉండాల్సిన ఆరోగ్యకరమైన పోటీకి వీరిరువురూ నిలువెత్తు నిదర్శనంగా నెటిజనులు ప్రశంసలు గుప్పిస్తున్నారు.