భర్తను చంపి బైక్ పై 12 కిలోమీటర్లు రైడ్...

 

సాధారణంగా భార్యలను భర్తలు హత్య చేసిన కేసుల గురించే వినుంటాం. కానీ ఇక్కడ ఓ మహిళ తన భర్తను హత్య చేసి ఒకటికాదు రెండు కాదు ఏకంగా 12 కిలోమీటర్లు బైక్ పై తీసుకెళ్లి ఆఖరికి పోలీసులకు చిక్కింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మండెం ప్రవల్లిక (25) తన భర్త పుల్లయ్య తలను గోడకేసి బాది హత్య చేసి ఆపై తన మేనల్లుడు సాయంతో బైక్ పై పెట్టుకొని శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో బయలుదేరింది. అయితే ట్రిపుల్ డ్రైవింగ్ లో ఉన్నందున ట్రాఫిక్ పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారు ఆపకుండా వెళ్లిపోయారు. ఇద్దరి మధ్య కూర్చున్న వ్యక్తి కాళ్లు నేలపై జారుతుండటం.. అతని తల యువకుడిపై వాలిపోయి ఉండటం గమనించిన పోలీసులు వారిని రెండుకిలోమీటర్లు పాటు వెంబడించి పట్టుకున్నారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా.. ప్రవల్లిక అసలు నిజం బయటపెట్టింది. అంతేకాదు ఆమెకు తన మేనల్లుడితో అక్రమ సంబంధముందని, అదే హత్యకు దారితీసిందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.