TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైదరాబాద్ గతం.. అమరావతి భవిష్యత్.. చంద్రబాబునాయుడు

Published on: Wed May 13, 2026 5:58PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక అడుగు వేశారు. మంగళవారం అమరావతిలో బొల్లినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్  యూనివర్శిటీ (బిసెర్ ) నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమరావతి భవిష్యత్తుపై తనకున్న విజన్‌ను పంచుకున్నారు.

 పాతిక ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. కేవలం వైద్య సేవలే కాకుండా స్కిల్ డెవలప్ మెంట్ కి ఈ సంస్థ పెద్దపీట వేయనుంది. రానున్న రోజుల్లో లక్ష మంది యువతకు శిక్షణ ఇచ్చి..  వారిని అంతర్జాతీయ స్థాయి నిపుణులుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. మెడికల్, పారామెడికల్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ యువత ప్రపంచానికి నాయకత్వం వహించాలని ఆయన పిలుపునిచ్చారు. 

అలాగే.. ఈ ప్రాజెక్టు గడువుపై స్పష్టమైన చంద్రబాబు నిర్దిష్ట గడువు నిర్దేశించారు.  వచ్చే ఏడాది మే నాటికి ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి, ప్రారంభోత్సవం చేయాలని  యాజమాన్యాన్ని కోరారు. ప్రభుత్వం తరపున అన్ని రకాల అనుమతులు  ఆటో పైలట్  మోడ్‌లో వేగంగా మంజూరు చేస్తామని,ఇన్వెస్టర్లు  పనుల్లో వేగం పెంచాలని సూచించారు. అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.  గతంలో తాను హైదరాబాద్‌ను ఏ విధంగా ఐటీ,  హెల్త్ హబ్‌గా మార్చానో గుర్తు చేస్తూ..  అమరావతిని అంతకంటే అద్భుతమైన నగరంగా నిర్మిస్తానని చంద్రబాబు  చెప్పారు. హైదరాబాద్ గతమైతే, అమరావతి భవిష్యత్తు అని ఆయన వ్యాఖ్యానించారు. ఔటర్ రింగ్ రోడ్, క్వాంటం వ్యాలీ వంటి ప్రాజెక్టులతో అమరావతి అంతర్జాతీయ పటంలో నిలుస్తుందన్నారు. 

రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన 29 వేల మంది రైతుల త్యాగాన్ని ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతుల కలలను నిజం చేస్తానని హామీ ఇచ్చారు. రైతులకు భవిష్యత్తులో ఈ నగరం ద్వారా అత్యధిక లాభం చేకూరుతుందని, అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయని చంద్రబాబు అన్నారు.  

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ, సోలార్ పవర్,  నేచురల్ ఫార్మింగ్‌ను ప్రోత్సహిస్తున్నట్లు సీఎం తెలిపారు. ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గించడమే కాకుండా..  పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్నారు. యువత కేవలం ఉద్యోగాల కోసం చూడకుండా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, అందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.

అమరావతి గడ్డపై బిసెర్ వంటి విద్యా, వైద్య సంస్థలు రావడం శుభపరిణామమన్న సీఎం చంద్రబాబు.. ఈ ప్రాజెక్టు ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించడమే కాకుండా..  రాజధాని ప్రాంతం ఒక మెడికల్ టూరిజం హబ్‌గా మారుతుందని చెప్పారు. పారదర్శక పాలన, వేగవంతమైన నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్‌ను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు.