హైదరాబాద్ పై మూడు ఆప్షన్ లు
posted on Sep 20, 2013 10:52AM
ఈ రోజు జరగనున్న కోర్ కమిటీ భేటీలో తెలంగాణపై కీలక చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, హైదరాబాద్ ప్రతిపత్తిపై కొన్ని ప్రతిపాదనల గురించి షిండే కోర్ కమిటీ సభ్యులకు వివరిస్తారని తెలిసింది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని ఏ విధంగా చక్కదిద్దాలి? హైదరాబాద్ ప్రతిపత్తిపై ఏ నిర్ణయం తీసుకోవాలి? అనే విషయంపై కోర్ కమిటీ మంతనాలు జరుపనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
హైదరాబాద్కు సంబంధించి మూడు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఒకటి... హైదరాబాద్ను చండీగఢ్ తరహా యూటీగా ప్రకటించి, రెండు రాష్ట్రాలకు రాజధానిగా చేయడం. రెండు...హైదరాబాద్కు ఢిల్లీ తరహా రాష్ట్ర ప్రతిపత్తి కల్పించి, రెండు రాష్ట్రాలకు రాజధానిగా ఉంచడం. మూడు... హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ప్రకటించి, ఆర్టికల్ 258ఏ కింద హైదరాబాద్లో శాంతి భద్రతల వంటి కొన్ని అధికారాలను కేంద్రం తన చేతిలో ఉంచుకుని, సీమాంధ్ర రాజధానిని కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం.
హైదరాబాద్ ద్వారా వచ్చే ఆదాయాన్ని రెండు రాష్ట్రాలకు పంచడం. ఈ మూడు ప్రతిపాదనలకు కూడా వర్కింగ్ కమిటీ పేర్కొన్న పదేళ్లనే కాలపరిమితిగా సూచించే అవకాశం ఉందని తెలిసింది. మొత్తానికి, ఈ మూడు ప్రతిపాదనల గురించి కోర్ కమిటీకి షిండే వివరించే అవకాశాలున్నాయి. ఆంటోనీ కమిటీ ఇప్పటిదాకా జరిపిన చర్చలను కూడా కోర్ కమిటీ సమీక్షిస్తుందని తెలిసింది.