TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నగరంలో కల్తీ మాఫియా... ఇప్పుడు నీటిలో కూడా కల్తీ!

Published on: Tue Apr 7, 2026 5:34PM

 

హైదరాబాద్ నగరంలో కల్తీ దందాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే పాలు, పండ్లు, మసాలాలు, అల్లం-వెల్లుల్లి, టీ పౌడర్, మాంసం వంటి అనేక ఆహార పదార్థాల్లో కల్తీ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల కుళ్లిపోయిన గొర్రె, మేక మాంసం, చికెన్‌ను ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్న ఘటనలు బయటపడడంతో ప్రజలు బయట భోజనం చేయడానికే భయపడే పరిస్థితి ఏర్పడింది.

ఇప్పుడు తాజాగా త్రాగే నీటిలో కూడా కల్తీ బయటపడటం మరింత ఆందోళన కలిగిస్తోంది. నగరంలోని అంబర్‌పేట్ ప్రాంతంలో అక్రమంగా నడుస్తున్న వాటర్ ప్లాంట్లపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. బోర్‌వెల్ నుంచి వచ్చే నీటిని ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండా నేరుగా ప్యాకెట్లలో నింపి “మినరల్ వాటర్” పేరుతో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తక్కువ ధరకు లభిస్తున్న ఈ ప్యాకెట్ నీటిని ప్రజలు విస్తృతంగా వినియోగిస్తున్నట్లు తెలిపారు.

ఈ వ్యవహారంపై సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ విభాగం సంయుక్తంగా దాడులు చేపట్టాయి. దాడుల సమయంలో ప్లాంట్లలోని పరిస్థితులు చూసి అధికారులు షాక్‌కు గురయ్యారు. అపరిశుభ్రమైన వాతావరణం, లీకేజీలతో ఉన్న యంత్రాలు, పాకురు పట్టిన ట్యాంకులు, ఎలాంటి శుద్ధి లేకుండా నీటిని ప్యాకింగ్ చేయడం వంటి అంశాలు బయటపడ్డాయి. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పలు ప్లాంట్లను అధికారులు సీజ్ చేసి, నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.

ఇప్పటికే ప్రతి వస్తువులో కల్తీ వెలుగులోకి వస్తున్న తరుణంలో, ఇప్పుడు త్రాగే నీటిలో కూడా కల్తీ బయటపడటం పరిస్థితిని మరింత భయంకరంగా మార్చింది. తక్కువ ధరకు లభించే ప్యాకెట్ నీటిని వినియోగించే ముందు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద ఉత్పత్తులపై వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచించారు. నగరంలో కల్తీ దందాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని వారు హెచ్చరించారు.