TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భార్య గొంతుకోసి హత్య చేసిన భర్త

Published on: Thu Jun 4, 2026 5:12PM

 

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఖైతలాపూర్ డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో ఓ భర్త తన భార్యను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. రహీమ్, సుమేరా దంపతులకు 2024లో వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రహీమ్‌కు, భార్య సుమేరాతో గత కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున మరోసారి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. 

మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి లోనైన రహీమ్, సుమేరాపై కత్తితో దాడి చేసి గొంతు కోసినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది.హత్య అనంతరం నిందితుడు నేరుగా కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు సమాచారం. అయితే అతడు లొంగిపోయాడా, లేక పోలీసులు అదుపులోకి తీసుకున్నారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఒక చిన్నారి తల్లిని కోల్పోయేలా చేసిన ఈ విషాద ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. కుటుంబ కలహాలు చివరకు హత్యకు దారితీయడం పట్ల కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. "కుటుంబ వివాదం.. క్షణికావేశం.. ఓ మహిళ ప్రాణం బలి" అంటూ ఈ ఘటన కూకట్‌పల్లిలో చర్చనీయాంశంగా మారింది.