TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అర్పిత ముఖర్జీ నివాసంలో మళ్లీ పట్టుబడిన భారీ నగదు

Published on: Thu Jul 28, 2022 10:47AM

పాఠశాలల కొలువుల కుంభకోణం కేసు పశ్చిమ బెంగాల్ ను కుదిపేస్తున్నది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి బెంగాల్ మంత్రి పార్థ చటర్జీ అరెస్టయ్యారు. ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీకి చెందిన ప్లాట్ లో ఇటీవల ఈడీ సోదాలలో రూ.21.90 కోట్ల రూపాయలు కుప్పలుగా పోసి ఉండటాన్ని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ సంఘటన రాజకీయంగా సృష్టించిన ప్రకంపనలు సద్దుమణగకముందే మళ్లీ పార్థా చటర్జీ అర్పిత ముఖర్జీకి చెందిన మరో ప్లాట్ లో ఈడీ నిర్వహించిన సోదాలలో కూడా భారీగా నగదు, బంగారం పట్టుబడింది.

పలు కీలక డాక్యుమెంట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండో సారి పట్టుబడిన సొమ్ము కూడా కొలువుల కుంభకోణానికి సంబంధించిన సొమ్మేనని అనుమతిస్తున్నారు. తొలుత తనిఖీల్లో  అర్పిత మొదటి ఫ్లాట్‌లో జరిపిన సోదాల్లో రూ. 21.90 కోట్ల నగదు, రూ. 56 లక్షల విదేశీ కరెన్సీ, రూ. 76 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సొమ్ము  సొమ్ము మంత్రి పార్థ ఛటర్జీకి చెందినదేనని విచారణలో అర్పిత ఈడీ అధికారులకు తెలిపారు.  

విపక్షాల నాయకులపై కేంద్రం ఈడీ, సీబీఐలను ఉసిగొల్పి వేధిస్తున్నదని పార్లమెంటులో విపక్షాలు ఆందోళన చేస్తున్న సమయంలో ఇలా తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన నాయకుడు మంత్రి భారీ నగదుతో పట్టుబడటం విపక్షాలను డిఫెన్స్ లో పడేసినట్లైంది. తన కేబినెట్ సహచరుడి విషయంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా గట్టిగా మాట్లాడలేని పరిస్థితిలో చిక్కుకున్నారు. ఆయన తప్పు చేసినట్లు తేలితే ఏ శిక్ష అయినా వేయండి అంటూ ఓ ప్రకటన చేసేసి ఆ కుంభకోణంలో తన పాత్ర లేదని చెప్పుకోవడానికే పరిమితమయ్యారు.