బీజేపీ ఇరుకున పడింది.. బాబుకి భలే ఆయుధం దొరికింది!!

 

ప్రస్తుతం టీడీపీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీల విషయంలో బీజేపీ మాటతప్పి మోసం చేసిందని టీడీపీ విమర్శిస్తుంటే.. మేం ఏపీకి ఏపీకి చాలా చేసాం, టీడీపీనే యూటర్న్ తీసుకుందని బీజేపీ అంటుంది. అయితే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ తన స్వహస్తాలతో టీడీపీకి ఆయుధాన్ని ఇచ్చి మరీ ఇరుకున పడింది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తిరుపతి వెంకన్న సాక్షిగా ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని మోదీ మాట ఇవ్వడమూ నిజం. ప్రధాని అయ్యాక ఏవేవో కారణాలు చెప్పి మాట తప్పడమూ నిజం. ఏపీ విషయంలో మాట తప్పిన బీజేపీ.. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో గోవాకి ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చింది. తాజాగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు వినయ్ సహస్రబుద్ధే.. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో గోవాకి ప్రత్యేకహోదా ఉంటుందని ప్రకటించారు. ఇదే ఇప్పుడు టీడీపీకి ఆయుధంగా మారింది. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారట. ఏపీకి హోదా ఇస్తానని మాట తప్పిన బీజేపీ.. ఇప్పుడు గోవాలోనూ అదే హామీనిచ్చి ప్రజలను మోసం చేస్తోందని బీజేపీని ఎండగట్టాలని బాబు కోరారట. ఎన్నికలు వస్తున్నాయని ఓట్ల కోసం బీజేపీ గోవాలో హోదా రాజకీయం మొదలుపెట్టింది. అందుకే మేనిఫెస్టోలో గోవాకి హోదా అంటుంది. మరి ఏపీకి ఎందుకు ఇవ్వదు? అని దేశవ్యాప్తంగా తెలిసేలా నిలదీయడానికి చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారట. మరి ఏపీకి హోదా విషయంలో వెనకడుగు వేసిన బీజేపీ గోవా అంశాన్ని ఎలా సమర్ధించుకుంటుందో చూడాలి.