గవర్నర్ అధికారాలపై మాట్లాడేది లేదన్న హోం శాఖ

 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో గవర్నర్‌కి విశేష అధికారాలనిచ్చే అంశంలో ఇప్పుడే ఏమీ మాట్లాడబోమని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్‌గోస్వామితో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో గవర్నర్‌కి అధికారాల అంశం మీద మాట్లాడే అవకాశం వుందేమోనిన ఇరు రాష్ట్రాల కార్యదర్శులు ప్రయత్నించినప్పుడు ఆయన స్పందన పైవిధంగా వుంది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాస్పద అంశాలపై చర్చ జరిగింది. పీపీఏ, కృష్ణా జలాల అంశాలపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తమ వాదనలు వినిపించారు. ఈఆర్సీ ఆమోదించిన పీపీఏలను మాత్రమే కొనసాగిస్తామని ఆంధ్రప్రదేశ్ సర్కార్, కృష్ణా ట్రిబ్యునల్ నాలుగు రాష్ట్రాల వాదనలు వినాలని తెలంగాణ ప్రభుత్వ సీఎస్ హోంశాఖ కార్యదర్శిని కోరారు.