కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణాలిచ్చిన బ్యాంకర్లకు సన్మానం!!

 

కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణాలిచ్చిన బ్యాంకర్లను ఘనంగా సన్మానించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సమీకరణకు వీలుగా ఏర్పాటు చేసిన కాళేశ్వరం కార్పొరేషన్‌ ద్వారా ఇప్పటివరకు ఏకంగా రూ. 40 వేల కోట్లకు పైగా సేకరించగా, అందులోంచే ప్రాజెక్టు నిర్మాణ పనులకు రూ. 29,259 కోట్లను ఖర్చు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భారీ నిధులను సమకూర్చడంలో బ్యాంకుల ద్వారా సేకరించిన రుణాలే కీలక పాత్ర పోషించాయి. ఈ ప్రాజెక్టు కి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, బ్యాంకు ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, ఇండియన్‌ బ్యాంకు, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ల నుంచి నిధుల సేకరించారు. ఈ నెల 21న ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం బ్యాంకర్లను ఆహ్వానించింది. వివిధ బ్యాంకుల సీఎండీలు, ఎండీలు, డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు బుధవారం రాత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు. వీరంతా గురువారం ఉదయం హెలికాప్టర్‌లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల ప్రాంతాల్లో పర్యటించి అక్కడి నిర్మాణాలను పరిశీలిస్తారు. అనంతరం రామగుండంలో బస చేస్తారు. శుక్రవారం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు వీరంతా పాల్గొననున్నారు. అదే రోజున వీరికి సీఎం చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరగనుంది.