హైదరాబాద్ లో టీటీడీ కల్యాణమండపం సీజ్!!

 

హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో గల టీటీడీ కల్యాణ మండపాన్ని తిరుమల విజిలెన్స్ అధికారులు చేశారు. లీజు గడువు ముగిసినా డబ్బు చెల్లించకుండా, వివాహాది శుభవేడుకలకు అద్దెకివ్వకుండా, వాణిజ్య కార్యకలాపాలకు మాత్రమే వాడుతున్నారన్న కారణంతో అధికారులు సీజ్ చేసి, తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రైవేటు వ్యాపారాలకు కల్యాణమండపాన్ని అద్దెకివ్వడం నిబంధనలకు విరుద్ధమని, గత సంవత్సరం అక్టోబర్ తోనే లీజు గడువు ముగిసిందని, బకాయి కోటి రూపాయలు దాటి పోయిందని అధికారులు వెల్లడించారు. అప్పట్లో లైసెన్స్ దారుడు కోర్టుకు వెళ్లి ఎక్స్ టెన్షన్ కోరుతూ స్టే ఆర్డర్ తెచ్చుకున్నారని, అప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని అధికారులు తెలిపారు. మరోవైపు.. ఈ కల్యాణమండపం పెళ్లిళ్లకు ఇవ్వకుండా, ఎగ్జిబిషన్లు తదితరాలకు మాత్రమే ఇస్తున్నారన్న విమర్శలు కూడా వెల్లువెత్తడంతో విజిలెన్స్ అధికారులు మండపాన్ని సీజ్ చేశారు.