బియాస్ నదిలో ‘సోనార్’ గాలింపు

 

హిమాచల్‌ప్రదేశ్ దుర్ఘటనలో బియాస్ నదిలో గల్లంతైన వీఎన్‌ఆర్ విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల ఆచూకీ కోసం ఆదివారం నుంచి అత్యాధునిక సోనార్ (సైట్ స్కాన్ రాడార్) పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన 16 మంది విద్యార్థులు, ఒక టూర్ ఆపరేటర్ కోసం ఏడోరోజైన శనివారం నావికాదళం, ఎన్‌డీఆర్‌ఎఫ్ దళాలు, రాష్ట్రం నుంచి వెళ్లిన ప్రత్యేక ఈత నిపుణులు, మరో 450 మంది పనివారు రోజంతా గాలించినా లాభం లేకపోయింది. ప్రమాద స్థలి నుంచి మూడు కిలోమీటర్ల మేరకు నదిలో నీటిమట్టాన్ని గంట పాటు కనీస స్థాయికి తగ్గించి వెదికినా ఒక్క మృతదేహం కూడా లభించలేదు. గురువారం వరకు 8 మంది విద్యార్థుల మృతదేహాలు లభించాయి. శుక్రవారం మానవరహిత విమానాన్ని రంగంలోకి దించినా లాభం లేకపోయింది. ఇప్పుడు జరుపుతున్న సోనార్ గాలింపులో కూడా మృత దేహాలు కనిపించకపోతే ఏం చేయాలో అధికారులకు కూడా పాలుపోవడం లేదు. తమ బిడ్డల ఆచూకీ కోసం డ్యామ్ వద్దే పడిగాపులు కాస్తూ, తమ పిల్లల కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల మనోవేదనకు అంతులేకుండా పోయింది. ప్రమాదం జరిగిన మండి జిల్లాలోనే వున్న తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి శనివారం స్థానిక ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.