హైకోర్టులో ప్రభాస్ కి ఊరట.. అధికారుల తీరుపై అసహనం

 

రంగారెడ్డి జిల్లాలోని రాయదుర్గ్ పాన్ మక్తాలో సినీ హీరో ప్రభాస్ కు సంబంధించిన భూమిని, అతిథిగృహాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.  దీనిపై ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించారు. భూమి కొనుగోలుకు సంబంధించిన డాకుమెంట్స్ ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ భూమి తమదే అంటూ స్వాధీనం చేసుకుందని పిటిషన్ దాఖలు చేశారు.

ప్రభాస్ రాజు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఆ భూమి సిఎస్-7 లిటిగేషన్ జోన్ లో ఉందని తేల్చింది. అయితే, భూమిని స్వాధీనం చేసుకోవడంలో రెవెన్యూ అధికారులు తగిన ప్రక్రియను అనుసరించలేదని, బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని అభిప్రాయపడింది. 1958 వ సంవత్సరం నుంచి ఆ భూమిపై వివాదం నడుస్తున్న సందర్భంలో వివాదంలో ఉన్న భూమిని ప్రభాస్ కు స్వాధీనం చేయమని చెప్పలేమని.. అలాగే, భూమిని కొనుగోలు చేసిన వ్యక్తులు క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసుకుంటే విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దానిని పరిగణలోకి తీసుకోవాలని కోర్టు పేర్కొంది. ఒకవేళ దరఖాస్తు పెట్టుకున్నా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకుంటే.. కొనుగోలు చేసిన వ్యక్తులు కోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది.

ఎనిమిది వారాల్లోగా ప్రభాస్ దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ప్రభాస్‌ దరఖాస్తు విషయంలో జారీ చేసే ఉత్తర్వుల ఆధారంగా.. ఈ వందల ఎకరాల భూమిపై యాజమాన్య హక్కులు కోరుతున్న మిగిలిన వారు కూడా అదే రీతిలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని హైకోర్టు తెలిపింది. ప్రభాస్‌ పెట్టుకున్న దరఖాస్తును ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తే, ఆ భూమి అతని స్వాధీనమవుతుందంది. ప్రభుత్వం అతని దరఖాస్తును తిరస్కరిస్తే అతను కోర్టును ఆశ్రయించవచ్చునని తెలిపింది.

భూమి ఎవరి స్వాధీనంలో ఉందో వారు రిజిస్టర్‌ సేల్‌ డీడ్ల ద్వారా ఆ భూములపై సంక్రమించిన హక్కులను వదులుకుని, ప్రభుత్వం నిర్ణయించిన క్రమబద్దీకరణ ఫీజు చెల్లిస్తే, అప్పుడు ప్రభుత్వం ఆ భూములను క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని హైకోర్టు తెలిపింది.