ఇంటర్ ఫలితాల వ్యవహారంపై హైకోర్టు సీరియస్

 

తెలంగాణ ఇంటర్ ఫలితాల అవకతవకల వ్యవహారంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని బాలల హక్కుల సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు ఇంటర్ బోర్డును తీవ్రంగా తప్పుపట్టింది. పరీక్షల్లో ఫెయిల్ అయిన మూడున్నర లక్షల మంది విద్యార్థుల పేపర్లను రీవాల్యుయేషన్ చేయగలరా అని కోర్టు ప్రశ్నించింది. అయితే.. ఇది ప్రతి సంవత్సరం జరిగేదే అని, మూడున్నర లక్షల మంది పేపర్లు రీవాల్యువేషన్ చేయాలంటే రెండు నెలల సమయం పడుతుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి కోర్టుకు సమాధానం ఇచ్చారు. ఈ సమాధానంపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 9 లక్షల మంది పేపర్లు వాల్యుయేషన్ చేయడానికి నెల రోజుల సమయం పడితే మూడున్నర లక్షల మంది పేపర్లు రీవాల్యుయేషన్ చేయడానికి రెండు నెలలు ఎందుకు పడుతుందని కోర్టు ప్రశ్నించింది. ఫెయిల్ అయిన వారి పేపర్లు రీవాల్యుయేషన్ చేసి ఫలితాలు ఇవ్వడానికి ఎంత సమయం పడుతుందో సోమవారం లోగా నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.