వైసీపీ నేతలకు హైకోర్టు నోటీసులు

న్యాయమూర్తులపై ఇటీవల కొందరు వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కొందరు.. న్యాయమూర్తులను కించపరుస్తూ.. వారికి కులాలను, పార్టీలను ఆపాదిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. న్యాయమూర్తులపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంపై హైకోర్టు సీరియస్ అయింది. 

న్యాయమూర్తులను కించపరుస్తూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల పై ఓ న్యాయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సోషల్‌ మీడియాలోనూ, మీడియాలోనూ కోర్టు తీర్పులపై వివాదాస్పద వ్యాఖ్యల్ని క్షుణ్ణంగా పరిశీలించిన హైకోర్టు.. మొత్తం 49 మందికి నోటీసులు జారీ చేసింది. వారిలో వైసీపీ నేతలు బాపట్ల ఎంపీ నందిగామ సురేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా ఉన్నారు.

డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. దీనిపై ఎంపీ నందిగామ సురేష్, ఆమంచి కృష్ణమోహన్ న్యాయమూర్తుల పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో వారికి కూడా నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.