ప్రభుత్వానికి హైకోర్టు ఆక్షింతలు
posted on Sep 17, 2013 8:41PM
ఎపిఎన్జీవోలు చేస్తున్న సమ్మె విషయంలో రాష్ట్రఅత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. సమైక్యాంద్ర కోసం జరుగుతున్న సమ్మెపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై మంగళ వారం వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా కోర్టు ప్రభుత్వాన్ని సమ్మె విరమింప చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని, ఇన్నాళ్లు ఎందుకు ఆపలేకపోయారని ప్రశ్నించింది.
ప్రభుత్వం తరుపు లాయర్ మాట్లాడుతు తాము ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నామని, ప్రత్యేకంగా మంత్రులు వారితో చర్చిస్తున్నారని తెలిపారు. దీంతో సమ్మె చేస్తున్న రోజు నుంచి ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని, సమ్మె విరమింప చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అయితే కోర్టు మంత్రుల సంప్రదింపులతో ఉపయోగం ఉండదని ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని తెలిపింది.
తమకు కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని ప్రభుత్వం కోరినా కోర్టు అందుకు నిరాకరించింది. సమ్మెను కట్టడి చేయడంపై ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు విచారణ బుధవారానికి వాయిదా వేసింది.