బీజేపీ కుట్ర బయటపెట్టిన శివాజీ... ఇదే ఆపరేషన్ ద్రవిడ..

 

హీరో శివాజీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎప్పటినుండో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటినుండో ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలని శివాజీ డిమాండ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన ఈరోజు ప్రత్యేక హోదా పోరాటంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం చేస్తున్న కుట్ర గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ పట్ల ఒక జాతీయ పార్టీ ఆపరేషన్ చేపట్టిందని...ఆపరేషన్ పేరు ద్రవిడ అందులో భాగమే ఏపీ గరుడ... తమిళనాడు, కేరళకు సంబంధించి ఆపరేషన్ రావణ...కర్నాటకలో ఆపరేషన్ కుమార అని అన్నారు. 2017 సెప్టెంబర్లోనే ఓ అజ్ఞాతవ్యక్తి ద్వారా ఈ విషయం నాకు తెలిసింది.. ఈ ఆపరేషన్ కు 4,800 కోట్లు కేటాయించారు..అందులో కొన్ని డిస్పాచ్ అయ్యాయి... 2019 ఎన్నికలే జాతీయ పార్టీ నిర్వహించే ఈ ఆపరేషన్ అని అన్నారు. రాష్ట్రం మీద వాళ్ల అధిపత్యం ఎలా సాధించాలనుకుంటున్నారో..ప్రతి విషయానికి నాదగ్గర ఆధారం ఉంది.. అంతేకాదు.. ఈ ఆపరేషన్ సంధాన కర్తగా ఓ రాజ్యాంగ శక్తి ఉన్నాడు అని కూడా చెప్పారు.

 

ఇదిలా ఉండగా..  ఇంకో విషయం కూడా శివాజీ బయటపెట్టారు. ఓ పక్కా ప్లాన్ ప్రకారం..రేపు అవిశ్వాసం తీర్మానం చర్చకు వస్తుంది..కేంద్ర ప్రభుత్వం తరపున ఆరుగురు వ్యక్తులు మాట్లాడుతారు.. అందులో ముగ్గురు ఇంగ్లీషులో, మరో ముగ్గురు హిందీలో మాట్లాడతారని చెప్పారు. ఈ ఆరు మంది కూడా అనర్గళంగా ధడ్ ధడ్ లాడిస్తారని... ఏపీకి అంతా చేసేశామని చెప్తారని.. వీరంతా మాట్లాడిన తర్వాత అవిశ్వాసాన్ని వ్యతిరేకించే వారు చేయెత్తాలని స్పీకర్ అడుగుతారని, అనుకూలంగా ఉండేవారు చేయెత్తాలని అడుగుతారని చెప్పారు. చివరకు అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఉండేవారే ఎక్కువగా కనిపిస్తున్నారంటూ... అవిశ్వాసం వీగిపోయిందని ప్రకటిస్తారని తెలిపారు. రేపు సభలో జరగబోయేది ఇదే అని తేల్చి చెప్పారు. దీంతో ఇప్పుడు శివాజీ వ్యాఖ్యలపై చర్చలు మొదలయ్యాయి. మరి ఇంత గట్టిగా చెబుతున్నాడంటే సమాచారం పక్కాగానే ఉండోచ్చని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి శివాజీ చెప్పినట్టే జరుగుతుందా.. లేక బీజేపీ ఏదైనా మార్పులు చేస్తుందా.. చూడాలి..