భారీ వర్షాలతో ముంబై మహానగరం అతలాకుతలం
Published on: Thu Sep 26, 2024 9:26AM

ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కురిసిన భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబైని అతలాకుతలం చేసేసింది. బుధవారం (సెప్టెంబర్ 25) నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో ముంబైలో జనజీవనం దాదాపు స్తంభించిపోయింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. నగర వ్యాప్తంగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది.
ముంబైలో బుధవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. సబర్బన్ రైళ్లు రద్దయ్యాయి. ముంబై విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. అంధేరీ ప్రాంతంలో మ్యాన్ హోల్ లో పడి ఒక మహిళ మరణించింది.
గురువారం (సెప్టెంబర్ 26)కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ముంబై, థానే, రాయ్గఢ్, రత్నగిరి జిల్లాలకు తీవ్ర భారీ వర్షాల ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


