భారీ వర్షాలు.. తెలంగాణలో స్తంభించిన జనజీవనం!
Published on: Thu Aug 28, 2025 10:15AM
.webp)
తెలంగాణలో కుండపోత వానలు కురుస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. వివిధ జిల్లాల్లో రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాలలో రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై 44 పై వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. పలు రైళ్లను రద్దు అయ్యాయి. మరిన్నింటిని దారి మళ్లించారు. భారీ వర్షాలకు అనేక జిల్లాల్లో చెరువులు కుంటలు తెగిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి , మెదక్ జిల్లాల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కామారెడ్డిలో క్లౌడ్ బరస్ట్ కారణంగా గంటలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
కామారెడ్డి పట్టణంలో వరదలకు కార్లు కొట్టుకుపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం అనేక జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో మంచి నీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా వర్షాలు కురుస్తున్నాయి. రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది..లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలో జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి.


