వర్షాలతో రైతన్నకు దెబ్బ మీద దెబ్బ
posted on Oct 24, 2013 10:45AM
రాష్టవ్యాప్తంగా వర్షాలు కుండపోతలా కురుస్తున్నాయి. గత 48 గంటలుగా రాష్ట్రంలోని అన్నిప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. పత్తి రైతుకు ఈ వర్షాలు శరాఘాతంగా పరిణమిచ్చాయి. చెరువులు, కుంటులు నిండి పారుతున్నాయి. పైలిన్ తుపానుతో ఇబ్బందుల్లో ఉన్న తీరప్రాంత రైతులకు ఈ అల్పపీడనం మూలంగా వచ్చిన తుపాను పులిమీద పుట్రలా మారింది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, హైదరాబాద్, కరీంనగర్లో ఎడతెరపి లేని వర్షం కురిసింది. ప్రస్తుతం నెల్లూరు-ఒంగోలు మధ్య అల్పపీడనం కేంద్రీకృతమయివుంది. తీరం సమీపంలో ఉన్నందున వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరో 48 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధనా కేంద్రం చెబుతుండడం రైతులకు మరింత ఇబ్బందికరంగా మారింది.
శ్రీకాకుళం జిల్లా మందసలో అత్యధికంగా 17 సెం.మీ, పలాస, సోం పేట, ఇచ్ఛాపురంలో 15 సెం.మీ, కాకి నాడ, చోడవరం, అనకాపల్లి, పత్తిపా డులలో 12 సెం.మీ, కళింగపట్నంలో 11 సెం.మీ, తిరుపతి, విశాఖ విమానాశ్ర యం, అరకు, కావలి, ఎలమంచిలి, పెద్దాపురంలలో 9 సెం.మీ, టెక్కలి, కోడే రులలో 8, అచ్చంపేట, గజపతినగరం, ఎర్రగొండపాలెం, వెంకటగిరి, మాచర్ల, దేవరకొండలలో 7, నెల్లూరు, అవనిగడ్డ, రణస్థలం, తణుకు, ఆత్మకూరు, దర్శి, తాడేపల్లిగూడెం, తెర్లాం, పాలకొండలలో 6, రాజమండ్రి, మచిలీపట్నం, కందు కూరు, నాగర్కర్నూల్, పొదిలి, పాడేరు, శ్రీకాళహస్తి, కైకలూరు, అద్దంకి, చీపురు పల్లి, విజయనగరంలో 5 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.