TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..ఎల్లో అలెర్ట్‌ జారీ

Published on: Mon May 26, 2025 4:44PM

 

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం, అల్లూరి జిల్లాల్లో  తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, కృష్ణానగర్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో వాన కురుస్తోంది. తెలంగాణలో ఈ నెల 29 వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని.. నైరుతి విస్తరణకు పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయని తెలిపింది. మంగళవారం పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపింది. 

నైరుతి రుతుపవనాల కారణంగా రాయలసీమలో  భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొన్నాది. ఈ మేరకు ఒకరోజు ముందుగానే ఇవాళ కడపలో ఓ మోస్తారుగా వర్షం కురుస్తోంది. అదేవిధంగా ఉపరితల ద్రోణి ప్రభావంతో బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చీరాల, వేటపాలెంలలో భారీ వర్షం కురిసింది. గంటకుపైగా కురిసిన వర్షానికి పట్టణంలోని రహదార్లు చిత్తడిగా మారాయి. భారీ శబ్దాలతో ఉరుములు, మెరుపులతో వాన పడుతుండటంతో ప్రజలు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముంబాయిలో భారీ వర్షంతో జనజీవనం  అతలాకుతలం అయింది. ఆత్రే చౌక్ మెట్రో స్టేషన్‌లోకి భారీగా వర్షపు నీరు చేరింది. స్టేషన్ మెట్లపై నుంచి నీరు జలపాతంలా ఉధృతంగా కిందికి ప్రవహిస్తున్న దృశ్యాలు అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నాయి. దీంతో స్టేషన్ ప్రాంగణం మొత్తం నీటితో నిండిపోయి చెరువును తలపించింది.