TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైదరాబాద్ లో వర్ష బీభత్సం

Published on: Sun Oct 9, 2022 8:44AM

భారీ వర్షం హైదరాబాద్ నగరాన్ని వణికించింది. నాలుగు గంటల వ్యవధిలో షేక్ పేట్ లో అత్యధికంగా 13.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా కురిసిన కుంభవృష్టికి రోడ్లు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి నీరు చేరింది. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. శివారు ప్రాంతాలు చిగురుటాకుల్లా వణికాయి. పలు చోట్ల డివైడర్లు సైతం మునిగిపోయాయి.

కొన్ని చోట్ల డివైడర్లు మునిగిపోయాయి. వర్ష ఉధృతికి ఎదురుగా ఏముందో కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. పలు ప్రాంతాలలో రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచింది. మాదాపూర్‌ లో 12.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉపరితల ద్రోణికి తోడు క్యుములోనింబస్ మేఘాలు తోడవ్వడంతో వాతావరణ శాఖ అంచనాలకు సైతం అందనంత స్థాయిలో హైదరాబాద్ ను వర్షం ముంచెత్తింది.  ఉదయం నుంచీ పొడిగానే ఉన్న వాతావరణం సాయంత్రం అయ్యేసరికి ఒక్కసారిగా మారిపోయింది.  సాయంత్రం 5.10 గంటలకు ప్రారంభమైన వాన.. ఎడతెరిపి లేకుండా నాలుగు గంటల పాటు కురిసింది.   శేరిలింగంపల్లి, బాచుపల్లి, మియాపూర్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, మాదాపూర్‌, హైటెక్‌సిటీ, మణికొండ, అత్తాపూర్‌, లంగర్‌హౌజ్‌, మెహిదీపట్నం, ఆసిఫ్ నగర్‌, షేక్‌పేట్‌, గోల్కొండ, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, టోలీచౌకీ సహా  పలు ప్రాంతాలలో అతి భారీ వర్షం కురిసింది.  

నీట మునిగిన ఐటీ కారిడార్‌కుండపోత వర్షానికి ఐటీ కారిడార్‌ జలమయమైంది. మాదాపూర్‌, కొండాపూర్‌, హైటెక్‌సిటీ, హఫీజ్‌పేట ప్రాంతాల్లో వరదనీరు చేరింది. శేరిలింగంపల్లి రైల్వే అండర్‌ పాస్‌ వద్ద భారీగా నీరు చేరడంతో వాహనాల రాకపోకలను జీహెచ్‌ఎంసీ అధికారులు నిలిపివేశారు.

  రానున్న రెండు రోజులూ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల ద్రోణి కారణంగా హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతవరణ శాఖ హెచ్చరికతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని నగర పౌరులకు సూచించింది.