దగ్గుబాటికి చంద్రబాబు పరామర్శ
Published on: Wed Jun 22, 2022 6:50AM
కేంద్ర మాజీమంత్రి పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావును తెలుగుదేశం అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పని చేసిన దగ్గుబాటి ఆ తరువాత రాజకీయంగా అంత క్రియాశీలంగా లేరు.
ఆయన సతీమణి పురంధేశ్వరి బీజేపీలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుకు దగ్గుబాటి తోడల్లుడు అవుతారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు మంగళవారం గుండెపోటు రావడంతో ఆయనను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
జూబ్లీ అపోలోలో చికిత్స పొందుతున్న దగ్గుబాటిని చంద్రబాబు నాయుడు మంగళవారం రాత్రి పరామర్శించారు.దగ్గుబాటి ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో ఆగస్టు సంక్షోభం తరువాత దగ్గుబాటి, చంద్రబాబుల మధ్య అంతగా సయోధ్య లేదు. సంక్షోభ సమయంలో చంద్రబాబుకు మద్దతుగా నిలిచిన దగ్గుబాటి ఆ తరువాత దూరమయ్యారు.


