పాకిస్థాన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లా

 

ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము కశ్మీర్, లడఖ్ ప్రాంతాలు సుసంపన్నం కావడానికి అవకాశాలు మెరుగుపడతాయని, దీంతో ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రమైన పాకిస్తాన్ పీఠం కదులుతుందని, అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లా వ్యాఖ్యానించారు. న్యూయార్క్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పాకిస్థాన్ పై విమర్శల వర్షం కురిపించారు. బలహీనమైన ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కశ్మీర్ లో వేర్పాటు వాదులను రెచ్చగొడుతూ పాకిస్తాన్ పాలకులు పబ్బం గడుపుకుంటున్నారని ఆయన దుయ్యబడ్డారు. ఈ కారణంతోనే జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తోందని ష్రింగ్లా ధ్వజమెత్తారు. వ్యూహాత్మకంగా ఉగ్రవాదాన్ని తన రాజకీయ అస్త్రంగా మార్చుకున్న పాకిస్తాన్ ప్రపంచ వ్యాప్తంగా ఉగ్ర దాడులకు కేంద్రంగా మారిందన్నారు.

ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థ అధినేత ఒసామా బిన్ లాడెన్ తన చివరి రోజుల్లో పాక్ లో ఆశ్రయం పొందాడని హర్షవర్దన్ గుర్తు చేశారు. కశ్మీర్ లో అభివృద్ధికి ఆటంకం కలిగించటమే పాక్ ధ్యేయమని కాబట్టి ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తోందని విమర్శించారు. కశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయం పై గత కొద్ది వారాలుగా పాక్ ప్రధాని ఆ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు చేస్తున్న ఉత్తర కుమార ప్రగల్భాలను యావత్తు ప్రపంచం గమనిస్తోందని అన్నారు. కశ్మీర్ పై కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పాక్ కాళ్ల కింద భూమి కదులుతుందని ష్రింగ్లా ఎద్దేవా చేశారు. ఉగ్రవాదమే ఆ దేశం ప్రధాన పరిశ్రమ దారిని నిర్విరామంగా ప్రోత్సహిస్తోందని ఆయన దుయ్యబట్టారు. కశ్మీర్ అభివృద్ధికే నిరోధకంగా ఉన్న తాత్కలిక చట్టాన్ని భారత్ రద్దు చేయడంతో అక్కడ పురోగతి శ్రేయస్సు నెలకొంటోందని, అందుకే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దీనిని అంగీకరించడం లేదని తెలిపారు.

ఆర్టికల్ 370 విషయంలో గత ప్రభుత్వాలు చేసిన చారిత్రాత్మక తప్పును ప్రస్తుత పార్లమెంటు సవరించిందన్నారు. దీనివల్ల కశ్మీర్ లో క్షీణించిన ఆర్థిక వ్యవస్థ హార్టీ కల్చర్ పర్యాటకం హస్తకళలను పునరుద్ధరించటానికి తలుపులు తెరుచుకున్నాయని వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతంల్లో ప్రజలకు సామాజిక ఆర్థిక న్యాయం జరుగుతుందని ష్రింగ్లా వివరించారు. భారత్ తీసుకున్న నిర్ణయం జమ్మూ కశ్మీర్ లో ఆర్థిక వృద్ధికి సాయపడుతుందన్నారు. అయితే పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని ద్రవ్యోల్బణం అయిదేండ్ల గరిష్టానికి చేరుకోగా రుణపరిమితి జిడిపిని మించిపోయిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఇరవై రెండవ సారి ఉద్దీపన ప్రకటించిందని హర్షవర్దన్ తెలియజేశారు. తన సొంత ఆర్థిక వ్యవస్థలు దివాలా తీయించే హక్కు పాక్ ప్రధానికి ఉన్న పొరుగు దేశం ప్రావిన్సులో ఇలాంటి నష్టాన్ని కలిగించాలని వారి నిర్ణయాన్ని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా పరిగణించాలని ష్రింగ్లా ఉద్ఘాటించారు.

ఇమ్రాన్ ఖాన్ మేల్కొంటే అభివృద్ధి జరిగి ప్రగతి కనిపిస్తుంది. ఉగ్రవాద మూలాలు నిర్మూలించొచ్చు ఉగ్రవాదం హింస శతృత్వాన్ని పాకిస్తాన్ త్యజించి సాధారణ దేశంగా ఉంటుందని ఆశిస్తున్నామని దక్షిణాసియా కోరిక కూడా ఇదేనని హర్షవర్ధన్ స్పష్టం చేశారు. భారత్ లోని ముస్లింలు హిందువేతరులు వేధింపులను ఎదుర్కొంటున్న పాక్ ప్రధాని వ్యాఖ్యలపై ష్రింగ్లా మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు చూస్తే నవ్వు పుడుతోందని వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. పాకిస్తాన్ ఏర్పడినప్పుడు మైనార్టీలు ఇరవై మూడు శాతం వుంటే ప్రస్తుతం వారి సంఖ్య మూడు శాతానికి పడిపోయిందన్నారు. మైనార్టీలు ఆదేశంలో ఎంతటి దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారో ఈ గణాంకాలే చెబుతాయని ఎద్దేవచేశారు.