TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీసీఎస్ లో లైంగిక వేధింపులు.. మహిళాకమిషన్ నివేదికలో దిగ్భ్రాంతికర అంశాలు

Published on: Wed May 13, 2026 8:44AM

టీసీఎస్  నాసిక్ యూనిట్‌లో   లైంగిక వేధింపుల వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన జాతీయ మహిళా కమిషన్  తాజాగా తన నివేదికను మహారాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో నాసిక్ కార్యాలయంలో మహిళా ఉద్యోగుల పట్ల అత్యంత దారుణమైన వేధింపులు జరిగిన మాట వాస్తవమేనని నివేదిక తేల్చింది.   లైంగిక వేధింపులతో పాటు, మతపరమైన దూషణలు,  వ్యవస్థాగత వేధింపులు  కూడా జరిగినట్లు మహిళాకమిషన్ నివేదిక పేర్కొంది. 

జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ నాసిక్ యూనిట్‌లో పర్యటించి బాధితులు, పోలీసులు, కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి ఈ నివేదికను రూపొందించింది. నివేదిక ప్రకారం.. నాసిక్ కార్యాలయం కొంతమంది వ్యక్తుల గుప్పిట్లోకి వెళ్ళిపోయిందనీ..  వారు యువతులు, కొత్తగా ఉద్యోగంలో చేరిన మహిళా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని లైంగికంగా, మానసికంగా  గురిచేశారు. నిందితులు మహిళలను లొంగదీసుకోవడానికి తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారు. 

మరీ ముఖ్యంగా..  కార్యాలయంలో పని చేసే మహిళలపై మతపరమైన ఒత్తిళ్లు కూడా ఉన్నాయని నివేదికలో  పేర్కొంది. హిందూ విశ్వాసాలను కించపరుస్తూ..   ఇతర మతాల పట్ల ఆకర్షితులయ్యేలా వేధింపులకు పాల్పడినట్లు నివేదిక తేల్చింది.  నిందితులు మహిళా ఉద్యోగులను నిరంతరం వేధించడం,  అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడినట్లు మహిళాకమిషన్ నివేదిక  నిర్ధారించింది.  

కార్పొరేట్ సంస్థల్లో మహిళల భద్రత కోసం అమలులో ఉండాల్సిన  పోష్ చట్టం అమలులో టీసీఎస్ నాసిక్ యూనిట్ పూర్తిగా విఫలమైందని జాతీయ మహిళాకమిషన్ పేర్కొంది.  అంతర్గత ఫిర్యాదుల కమిటీ   నామమాత్రంగానే ఉందనీ, బాధితుల పట్ల కనీస సానుభూతి కూడా చూపలేదని కమిషన్ నివేదిక పేర్కొంది. 

ఈ వ్యవహారం కేవలం నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదనీ, ఇది యాజమాన్య వైఫల్యమని కమిషన్  పేర్కొంది. ఫిర్యాదు చేసిన వారిని బదిలీ చేస్తామని లేదా ఉద్యోగాల నుండి తొలగిస్తామని బెదిరించడం వల్ల చాలా మంది బాధితులు బయటకు రాలేకపోయారని పేర్కొన్న మహిళాకమిషన్.. నిందితులపై   కఠిన చర్యలు తీసుకోవాలని, సాక్షులకు రక్షణ కల్పించాలని  సిఫార్సు చేసింది. ఈ నివేదిక నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం, టీసీఎస్ యాజమాన్యం తీసుకోబోయే చర్యలపై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.