హరీష్ రూటే వేరు..!
posted on Sep 11, 2013 5:46PM
రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోతుండటం.. సీమాంధ్రలో ఉద్యమం ఎగసిపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర విభజనపై అందరిలోనూ పునరాలోచన మొదలవడం తెలంగాణ నేతల్ని అసహనానికి గురిచేస్తున్నట్లుంది. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా చేసేందుకు కూడా ఒప్పుకోమని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం వ్యాఖ్యానిస్తే .....తెరాస నేత హరీష్ రావు సీమాంధ్ర ప్రాంత ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేశారు. ఉద్యమం విషయంలో సీమాంధ్రుల్లో అనుమానాలు రేకెత్తించి.. ఆందోళనలు విరమింపజేయాలనే ఉద్దేశం ఆయన వ్యాఖ్యల్లో కనిపించింది.
సమ్మె పేరిట పెత్తందారుల కొమ్ముకాస్తున్నారని ఆరోపించిన హరీష్.. పేద ప్రజలు ప్రయాణించే ఆర్టీసీని బంద్ చేసి ట్రావెల్స్ లో అధిక ధరలు వసూలు చేస్తున్నారన్నారు. సీమాంధ్ర పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసేందుకే సీమాంధ్ర ఉద్యమమన్నారు. సీమాంధ్రలో ఉన్న నిరుపేదల కడుపుకొట్టి సమ్మె పేరుతో దోచుకుంటున్నారన్నారు. సీమాంధ్రలో సమ్మె పేరిట గిరిజనులకు వైద్యం అందించే పీహెచ్సీలు బంద్ చేశారు తప్ప కార్పొరేట్ వైద్యం ఆగిందా చెప్పాలన్నారు.
మొత్తంగా హరీష్ వ్యాఖ్యలు చూస్తే సీమాంధ్ర ప్రజల్లో ఉద్యమం పట్ల సందేహాలు రేకెత్తించాలన్న ఉద్దేశం కనిపిస్తోంది. సామాన్యులకు మద్దతుగా మాట్లాడితే వారు తెలంగాణకు అనుకూలంగా మారిపోతారని హరీష్ అనుకోవడం భ్రమే.