దేశాన్ని వణికించింది పురుగా..?

 

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుర్‌గావ్ ఇలా దేశంలోని వివిధ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా మహిళలు ఇళ్లు విడిచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. మగవారు పనులను మానుకొని ఇంటి పట్టునే ఉడిపోతున్నారు. ఇళ్ల ద్వారాలకు, కిటికీలకు నిమ్మకాయలు, ఎండు మిరపకాయలు కడుతున్నారు. కారణం అంతుచిక్కని రీతిలో మహిళల జుట్టు కత్తిరించబడటమే. మొదట్లో మంత్రగాళ్లు..ఆ తర్వాత భయానక ఆకారంలో ఉన్న వృద్దుడు త్రిశూలంతో వచ్చాడన్నారు..గ్రహాంతరవాసులన్నారు...దెయ్యమన్నారు. ఇలా ఇష్టమొచ్చిన రీతిలో పుకార్లు షికార్లు చేశాయి. పాపం అనుమానంతో ఓ వృద్ధురాలిని కొట్టి చంపారు కూడా. అయినా జుట్టు కత్తిరించేది ఎవరన్నది మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. జనం రక్షణ కోసం మంత్రగాళ్లను ఆశ్రయించడం..పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్న సమయంలో అసలు దొంగ ఎవరో తేలిపోయింది. అది ఎవరో కాదు ఒక పురుగు. దేశవ్యాప్తంగా ఎంతోమంది మెదళ్లను తొలచివేసి..కొన్ని లక్షల మందికి నిద్ర లేకుండా చేసిన ఈ రహస్యాన్ని ఛేదించారు బీహార్ వాసులు. పాట్నాలోని రామకృష్ణానగర్‌లోని ఒక ప్రాంతంలో సంచరిస్తున్న ఓ వింతపురుగును పట్టుకున్నారు స్థానికులు. మహిళల జుట్టును కత్తిరిస్తోంది ఈ పురుగేనని వారు చెబుతున్నారు. అందుకు సాక్ష్యంగా ఆ పురుగు నోటితో జుట్టును ఎలా కత్తిరిస్తోందో చూపించడమే కాకుండా వీడియో కూడా తీశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన బాధితులు నోరెళ్లబెడుతున్నారు..ఇంతకాలం తమ కంటికి కునుకు లేకుండా చేసింది ఒక పురుగని తెలిసి నవ్వాలో..ఎడవాలో అర్థం కావడం లేదని కొందరు వాపోతున్నారు. ఇప్పటికి మిస్టరీ వీడిందని సంతోష పడుతున్నా..? అసలు దోషి ఈ పురుగా..లేక మరేదైనానా అన్నది తెలియాల్సి ఉంది.