విశాఖ కమీషనర్ రామాంజనేయులకు త్వరలో బదిలీ?
Published on: Tue Apr 3, 2012 11:46AM
మహా విశాఖ నగర పాలక సంస్థ (జివిఎంసి) కమీషనర్, ఐఎఎస్ అధికారి అయిన బి. రామాంజనేయులును త్వరలోనే బదిలీ చేయాలన్న యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖలో బి. రామాంజనేయులు తీసుకున్న నిర్ణయాలు అనేకం వివాదాస్పదంగా మారాయి. తాజాగా ఆయన జిల్లా కలెక్టర్. జివిఎంసి ప్రత్యేక అధికారి అయిన లవ్ అగర్వాల్ తో గొడవ పెట్టుకున్నారు. నిజానికి లవ్ అగర్వాల్ రామాంజనేయులు కన్నా జూనియర్. కానీ రామాంజనేయులు నగరపాలక సంస్థ కమీషనర్ గా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందుగా దానిని స్పెషల్ ఆఫీసర్ లవ్ అగర్వాల్ కు తెలియజేయాల్సి ఉంటుంది. కానీ తనకన్నా జూనియర్ అయిన అధికారి ముందు తను చేతులు కట్టుకుని నిలబడాల్సిన అవసరం లేదంటూ రామాంజనేయులు అన్ని ఏక పక్ష నిర్ణయాలు తీసుకొంటున్నారు. తాజాగా పారిశుద్ధ్య పనులకోసం వార్డులవారీగా టెండర్లను రామాంజనేయులు తన పై అధికారి అయిన లవ్ అగర్వాల్ కు చెప్పకుండా పిలిచారు.
ఇప్పటిదాకా నిగ్రహంతో ఉన్న లవ్ అగర్వాల్ ఈ చర్యతో అగ్రహోదగ్రుడయ్యాడు. తనకు ఫైల్ పంపకుండా ఎందుకు నిర్ణయం తీసుకున్నారంటూ రామాంజనేయులుకు నోటు పంపినట్లు తెలిసింది. వీరిద్దరి గొడవ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అందుకే త్వరలో రామాంజనేయులును ఇక్కడినుంచి బదిలీ చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలిసింది.


