వియత్నాం వ్యాపారి చెవిలో గుంటూరు మిర్చి

 

వియత్నాం దేశానికి చెందిన ఒక వ్యాపారి గుంటూరుకు చెందిన మధు అనే ఒక మిర్చి వ్యాపారిని నమ్మాడు. మంచి మిరపకాయలు పంపించు బ్రదర్ అంటూ ఆన్‌లైన్‌లో 30 లక్షల డబ్బు ట్రాన్స్ ఫర్ చేశాడు. మన గుంటూరు మిర్చి వ్యాపారి అయిన మధు పేరులోనే మధు వున్నవాడు.. మనిషి మాత్రం మిర్చిలాగా మహా ఘాటు. మిర్చిలాంటి కుర్రాడైన మధు ఎంచక్కా వియత్నాం వ్యాపారి చెవిలో మంచి ఘాటైన మిరపకాయ పెట్టాడు. వియత్నాంకి మిర్చి రవాణా చేయకుండా తప్పించుకుని తిరగడం మొదలెట్టాడు. జరిగిన మోసం తెలుసుకున్న వియత్నాం వ్యాపారి మిర్చి నమిలినట్టుగా లబోదిబో అంటూ గుంటూరుకు వచ్చి మరీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాడు. సదరు మధు అనే వ్యాపారి ప్రస్తుతం పరారీలో వున్నాడు. ఈ వ్యాపారి గతంలో చైనా వ్యాపారులకు చెవిలో కూడా మిరపకాయ పెట్టినట్టు సమాచారం.