విమానయాన సంస్థలపై చూపిస్తున్న శ్రద్ధ ప్రజలపై చూపిస్తే బాగుంటుంది

'వందేభారత్ మిషన్' పేరిట విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి రప్పించేందుకు నడుస్తున్న విమానాల్లో భౌతికదూరం నిబంధనలు పాటించడలేదంటూ సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విమానాల్లో మధ్య సీట్లను తప్పనిసరిగా ఖాళీగా ఉంచాలని స్పష్టం చేసింది. వాణిజ్య విమానయాన సంస్థల మీద చూపిస్తున్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై చూపిస్తే బాగుంటుందని హితవు పలికింది. లాభాల కోసం కాకుండా ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సర్వీసులు నడిపించాలని సుప్రీం కోర్టు సూచించింది.

విమానాల్లో ప్రయాణికులను కూర్చోబెడుతున్న తీరును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రశ్నించారు. భౌతిక దూరం నిబంధనలను కేంద్రం ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు. మధ్య సీట్లను ఖాళీగా ఉంచకుండా, అందులోనూ ప్రయాణికులను కూర్చోబెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. బహిరంగ ప్రదేశాల్లో ఆరడుగుల భౌతికదూరం పాటించాలంటున్నారు, మరి విమానాల్లో ఏ విధంగా పాటిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మధ్య సీట్లు వదిలేయడం కంటే కరోనా టెస్టులు, క్వారంటైన్ విధానాలు అత్యుత్తమం అని నిపుణులు చెప్పిన మేరకే ఆ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం తరఫున తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఇప్పటికే జూన్ 6 వరకు బుకింగ్స్ పూర్తయ్యాయని తుషార్ విన్నవించగా, ఆ తర్వాత మాత్రం మధ్య సీట్లు వదిలేయాల్సిందేనని సుప్రీం తేల్చి చెప్పింది.