గవర్నర్‌కి అధికారాలు తప్పవు... బిల్లులో వున్నవే...

 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతిభద్రతలు గవర్నర్ పరిధిలోనే వుంటాయని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన బిల్లులో పేర్కొన్న విధంగానే గవర్నర్‌కి అధికారాలు కట్టబెట్టామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్‌లో శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు గవర్నర్ నేరుగా జోక్యం చేసుకుంటారని, రోజువారీ పాలనలో గవర్నర్ జోక్యం వుండబోదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇదిలావుండగా, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ శుక్రవారం నాడు ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. ఆంధ్రప్రదేశ్, రాజధానిలోని పరిస్థితులను మోడీకి ఆయన వివరించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించిన అంశాలను మోడీ ఈ సందర్భంగా గవర్నర్‌ దగ్గర ఆరా తీసినట్టు తెలుస్తోంది. నరసింహన్ మోడీతో అరగంటపాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రికి గవర్నర్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరు మీద కూడా నివేదిక సమర్పించినట్టు సమాచారం.