జోక్యం చేసుకున్నందుకు జగన్ నన్ను క్షమించాలి: గవర్నర్ నరసింహన్

 

తాను ఎక్కడ ఉన్నా ఏపీ అభివృద్దిని కాంక్షిస్తానని.. తాను తెలిసో, తెలియకో తప్పులు చేసి ఉంటే క్షమించాలని గవర్నర్ నరసింహన్ అన్నారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన వీడ్కోలు సభలో నరసింహన్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఏపీ ప్రజలను తానెప్పటికీ మర్చిపోలేనన్నారు. ఏపీ ప్రజల్ని వదిలి వెళుతున్నందుకు తనకు బాధగా ఉందన్నారు. ఏపీతో తనకు అవినాభావ సంబంధం ఉందన్న నరసింహన్.. 1951లో విజయవాడలోనే తనకు అక్షరాభ్యాసం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు. పాలన అద్భుతంగా ఉందని కొనియాడారు. జగన్ ను తన కుమారుడిగా భావిస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీలో జగన్ అనుసరిస్తున్న తీరు బాగుందని, చివరి వరకు ఇదే పంథా అనుసరించాలని కోరారు. కొన్ని సందర్భాల్లో మితిమీరి జోక్యం చేసుకున్నందుకు జగన్ తనను క్షమించాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే అలా చేయాల్సి వచ్చిందని నరసింహన్ వివరించారు.

ఈ కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ.. తమను వీడి వెళుతున్నందుకు బాధగా ఉన్నప్పటికీ, పక్కనే ఉన్నారన్న సంతోషం కూడా ఉందన్నారు. నరసింహన్ తో తనకు పదేళ్ల పరిచయం ఉందన్నారు. గవర్నర్ నరసింహన్ నాన్నగారిలా తనకు అనేక సలహాలు ఇచ్చారని.. తాను సీఎం అయ్యాక కూడా ముందుండి నడిపించారన్నారు. మరికొంతకాలం ఆయన గవర్నర్ గా కొనసాగి ఉంటే బాగుండేదన్న భావనను జగన్ వ్యక్తం చేశారు. పెద్దాయన స్థానంలో నరసింహన్ ను తన మనసులో ఉంచుకుంటానని జగన్ వ్యాఖ్యానించారు.