గవర్నర్ ఇఫ్తార్ విందుకి కేసీఆర్ డుమ్మా!

 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ బుధవారం నాడు రాజ్‌‌భవన్‌లో రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును, ప్రతిపక్ష నాయకుడు జగన్‌ని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఆహ్వానించారు. గవర్నర్ ఆహ్వానాన్ని గౌరవిస్తూ చంద్రబాబు, జగన్ విందుకు వచ్చారు. కేసీఆర్ మాత్రం పనుల ఒత్తిడిలో వున్నానంటూ ఇఫ్తార్ విందుకు డుమ్మా కొట్టారు. ఈ సందర్భంగా ఒకరికొకరు ఎదురైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరస్పరం నమస్కారం చేసుకున్నారు. ఇఫ్తార్ విందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, ఇతర పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు.