గవర్నర్ మధ్యవర్తిత్వం ఫలించేనా?
Published on: Sat Aug 16, 2014 8:01AM
.jpg)
స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గవర్నర్ నరసింహన్ నిన్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అల్పాహార విందుకు ఆహ్వానించి వారిరువురి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసారు. గవర్నర్ పెద్దరికంతో చేసిన మధ్యవర్తిత్వాన్ని మన్నించి ఇరువురు ముఖ్యమంత్రులు ఇకపై సమస్యలను చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకొంటామని హామీ ఇచ్చారు. ముందు అధికారుల స్థాయిలో సమస్యాత్మక అంశాలను గుర్తించి ఆ తరువాత వాటిపై ఇరువురూ కూర్చుని మాట్లాడుకోవాలని సూత్రప్రాయంగా అంగీకరించారు. నిజానికి రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకొనే ధోరణి అవలంభిస్తే ఎటువంటి సమస్యలనయినా చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడం కష్టమేమీ కాదు. కానీ ఈ గొడవలన్నిటికీ మూలం ఆ సమస్యలు ప్రధాన కారణం కాదు. ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాలను నడుపుతున్న తెదేపా, తెరాసల మధ్య, వాటి అధినేతల మధ్య రాజకీయ వైరమే ప్రధాన కారణమని చెప్పవచ్చును. అదీకాక ప్రభుత్వాలను నడుపుతున్న ఆ రెండు పార్టీలపై ప్రజలు చాలా భారీగా ఆశలు పెట్టుకొన్నారు. అందువల్ల వారిని మెప్పించే ప్రయత్నంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ అంశంపై పంతాలకు, పట్టింపులకు పోతుండటంతో గోటితో పోయే సమస్యలకు కూడా గొడ్డలి అందుకొంటున్నాయి. కనీసం ఇప్పటినుండయినా చంద్రబాబు, కేసీఆర్ సయోధ్యకు ప్రయత్నిస్తే గవర్నరే కాదు ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా చాలా సంతోషిస్తారు.


